ఆలోచించే మెదళ్లను చంపుతున్న చరిత్ర

భారత స్వాతంత్ర సమర కాలములో కేంద్ర శాసనసభ 1926లో బ్రిటిష్ సామ్రాజ పాలకులు కమ్యూనిస్టుల అణిచివేతలపై ప్రభుత్వం

Update: 2024-10-15 14:58 GMT

భారత స్వాతంత్ర సమర కాలములో కేంద్ర శాసనసభ 1926లో బ్రిటిష్ సామ్రాజ పాలకులు కమ్యూనిస్టుల అణిచివేతలపై ప్రభుత్వం ప్రజా భద్రత చట్టాన్ని ప్రవేశపెట్టినప్పుడు స్వాతంత్ర సమరయోధుడు, ఉగ్ర జాతీయవాదిగా పేరుందిన లాలా లజపతిరాయ్ చాలా తీవ్రంగా వ్యతిరేకిస్తూ అన్న మాటలు ఈ సందర్భంలో వాస్తవానికి చాలా దగ్గరగా ఉన్నాయి.

"విప్లవోద్యమం ఉంది అంటే ఆ దేశ ప్రభుత్వ విధానంలో ఏదో పెద్ద లోపం ఉంది అన్నమాట. అటువంటిప్పుడే ప్రజలు విప్లవ పద్ధతులకు దిగుతారు. వీరులైన కమ్యూనిస్టు దేశభక్తుల పట్ల వారికి క్షమాబిక్ష కోరడం లేదని ఆ విధంగా కోరినట్లయితే వారిని అవమానించినట్లే అవుతుంది. బోల్షివిజం (Bolshevism) వల్ల కానీ కమ్యూనిజం (Communism)వల్ల కానీ మనకేమీ బెడద లేదు. మనకు ముప్పుగా తయారయింది. స్వప్రయోజనా కారులైన పెట్టుబడిదారులు."

నేటి భారత పాలకుల కుట్ర మూలాల్లో బ్రిటిష్ సామ్రాజ్య పాలకుల మూలాలు నిక్షిప్తమై ఉన్నాయి అనడానికి 1926లో కేంద్ర శాసనసభలో లాలా లజపతిరాయ్ అణచివేతను వ్యతిరేకిస్తూ అన్న వాక్యాలు ఇందుకు నిదర్శనం. నేటి భారత పాలకుల ఫ్యాసిస్టు పరిపాలనకి అద్దం పడుతున్నాయి. ఈనాడు ప్రొఫెసర్ సాయిబాబా మరణానికి కారణం అండా సెల్ జైల్లో వారికి ఎలాంటి వైద్య సదుపాయాలు సరైన సమయంలో కల్పించకపోవడమే ఇన్ని రకాల జబ్బులకి కారణం. ఇది భారత నేరపూరిత పాలకుల హత్య.

మరణాన్ని చేరువ చేసిన నిర్బంధాలు

ప్రపంచంలో రెండు అరుదైన సంఘటనలు మన ముందు కనబడుతున్నాయి. ఒకటి: ఇటాలియన్ కమ్యూనిస్టు నాయకుడైన ఆంటోనిగ్రామ్స్ కి Mussolini నియంతృత్వ పరిపాలనలో సుమారు సంవత్సరాలుగా జైలు నిర్బంధంలో అనేక రకాలైన అనారోగ్య సమస్యలు ఏర్పడ్డాయి. భయంకరమైన అనారోగ్యంతో ఉన్న సందర్భంలో వారిని విడుదల చేసినారు. విడుదల చేసిన ఆరు నెలలకి అదే అనారోగ్యంతో చనిపోయారు.

అలాగే రెండవది: నేడు మరణించిన ప్రొఫెసర్ సాయిబాబా గారిది. బాంబే హైకోర్టు జస్టిస్ న్యాయం పట్ల, సత్యం పట్ల తమ ఉనికిని కాపాడుకోవడానికి, దేశ ప్రజల ముందు ప్రదర్శించు కోవడానికి ప్రొఫెసర్ సాయిబాబా గారిని ఎంతో నిష్పక్షపాతంగా నిర్దోషిగా తీర్పు చెబుతూ విడుదల చేసింది. ఇది భారతదేశంలో ఉన్న న్యాయవ్యవస్థ యొక్క కుట్రపూరిత ఎత్తుగడ. బూర్జువా శాసనం రెండు వైపుల పదునైనదే అని అంతర్లీనంగా తెలియజేస్తోంది.

రాజ్యానికి తెలుసు సాయిబాబా గారు కొన్ని నెలలు మాత్రమే బతుకుతారు అని. ఆ విషయం తెలిసి వారిని నిర్దోషిగా విడుదల చేస్తున్నట్టుగా, ప్రజలకు న్యాయం పట్ల విశ్వాసం కలిగేటట్టుగా, తమ ఉనికిని కాపాడుకోవడానికి చేసినటువంటి కుట్రపూరిత ఎత్తుగడ. సాయిబాబా గారి మరణం భారత పాలకుల హత్య.

ప్రపంచంలో జరిగిన నాలుగు హత్యల సంఘటన ఇప్పుడు చారిత్రాత్మక అవసరంగా గుర్తుచేసుకోవాల్సిన విషయం. ప్రపంచం ఉన్నంతవరకు ఈ సంఘటనలు ప్రజల హృదయాల్లో చిరస్మరణీయంగా ఉంటాయి.

మొదటిది: రోమన్ పాలకులు జీసస్ క్రైస్ట్ ను అత్యంత దారుణంగా భయంకరంగా సిలువ శిక్ష తో రాజ్యం చేసిన మొదటి హత్య..

రెండవది : గ్రీకు పాలకులు 70 ఏళ్ల వయోధుడైన సోక్రటీస్ ని "గ్రీకు దేశం లోని యువతలో ప్రశ్నించే తత్వాన్ని ఉద్బోధిస్తున్నాడని, పాలకులను ప్రశ్నిస్తున్నారని దేశంలో అలజడి సృష్టిస్తున్నాడని" సోక్రటీస్ కి మరణశిక్ష విధించి విషమిచ్చి చంపివేశారు. గ్రీక్ పాలకులు కొన్ని శతాబ్దాల తర్వాత సోక్రటీస్ శిక్ష పట్ల పెద్ద తప్పు చేశామని పక్షత్తాపం ప్రకటించారు.

మూడవది: ఇటాలియన్ ఫాసిస్ట్ నియంత బెనిటో ముసోలిని ( Mussolini) ఇటాలియన్ కమ్యూనిస్టు నాయకుడు ఆంటోని గ్రాంస్కిని అరెస్టు చేసి జైల్లో నిర్బంధించి "ఈ మెదడుని 20 సంవత్సరాల కాలం పాటు పనిచేయకుండా చేయాలని'' న్యాయమూర్తులు ప్రకటించి జైలు నిర్బంధంలో ఉన్నప్పుడు పలు రకాల అనారోగ్య సమస్యలు ఏర్పడ్డాయి. వైద్య చికిత్సలకి అంతుబట్టని వ్యాధులతో ఊపిరి సలపని దశలో గ్రామ్స్కిని విడుదల చేయడం జరిగింది. విడుదల చేసిన ఏడు నెలలకే ఆయన చనిపోయారు. కమ్యూనిస్టు గ్రామ్స్కిని ఇటాలియన్ రాజ్యం హత్య చేసింది. నియంత్ర బెనిటో ముస్సోలిని.

నాల్గవది: భారత దేశ పాలకులు ఆదివాసీ హక్కులకై పోరాడుతున్నారని, భారతదేశంలో సోషలిస్టు నిర్మాణానికి కృషి చేస్తున్నారని, ప్రొఫెసర్ సాయిబాబా గారిపై కుట్ర కేసులు బనాయించి జీవిత కారాగార శిక్ష విధించారు. భారత పాలకులు అనారోగ్యానికి గురి చేసి హత్య చేశారు. ప్రపంచంలోనే ఇది నాలుగో హత్య.

అమానుష నిర్బంధంలో ముంచెత్తి...

భారత పాలకులు అత్యంత పకడ్బందీ వ్యూహంతో నాగపూర్ అండా సెల్‌లో నిర్బంధించి పలు రకాల అనారోగ్య సమస్యలకు గురిచేసి చివరి దశలో బాంబే హైకోర్టు చేత నిర్దోషిగా విడుదలకు ఉత్తర్వులు జారీ చేయించారు. 9 సంవత్సరాల శిక్ష కాలంలో విడుదలైన కొన్ని రోజులకి జైల్లో ప్రబలిన అనారోగ్య సమస్యల పట్ల ఆసుపత్రుల చుట్టూ తిరుగుతూ చివరికి హైదరాబాదులోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ వైద్య బృందానికి, కుటుంబీకులకి, మిత్రులకి, భారత పీడిత ప్రజల మానవాళికి భరోసా కలిగిస్తూ నేను తిరిగి మళ్లీ ఆరోగ్యంతో మీ ముందు ఉంటాను అని చెబుతూనే మనందరి నుంచి వెళ్లిపోయారు.

ప్రపంచ పీడిత మానవళి ఒక విముక్తి పోరాట యోధుడిని, ఒక సోషలిస్టు నిర్మాణ కార్యకర్తని, ఒక రాష్ట్రానికీ, ఒక దేశానికి సంబంధించిన వాడు కాదు.. యావత్ ప్రపంచానికి సంబంధించిన ఒక నూతన మానవుని కోల్పోయింది.

మీ ఆశయాన్ని కొనసాగిస్తాం కొనసాగిస్తాం

జోహార్ కామ్రేడ్ సాయిబాబా

విప్లవ జోహార్లు కామ్రేడ్ సాయిబాబా

= మా సత్యం

విప్లవ రచయితల సంఘం సభ్యులు

94940 52775


Similar News