ఎన్ఆర్ఐ ప్రియురాలిపై దారుణం.. కేబుల్స్తో కట్టేసి సజీవంగా పాతిపెట్టిన ప్రియుడు
భారత్కు చెందిన 21 ఏళ్ల ప్రియురాలిపై ప్రియుడు ఆస్ట్రేలియాలో దారుణానికి పాల్పడ్డాడు.
అడిలైడ్: భారత్కు చెందిన 21 ఏళ్ల ప్రియురాలిపై ప్రియుడు ఆస్ట్రేలియాలో దారుణానికి పాల్పడ్డాడు. నర్సింగ్ విద్యార్థిని జాస్మిన్ కౌర్ను అడిలైడ్లోని ఆమె కార్యాలయం నుంచి కారులో కిడ్నాప్ చేసి, ఆమె కళ్లకు గంతలు కట్టి, నోటికి గాఫర్ టేప్ అతికించి, కాళ్లు, చేతులను కేబుల్స్తో బంధించి నాలుగు గంటలపాటు ప్రయాణించి ఫ్లిండర్స్ రేంజ్స్ చేరుకున్నాడు. అక్కడ ఆమెను సజీవంగా పూడ్చి పెట్టాడు. తనను దూరం పెడుతోందనే కోపంతో ఆమె ప్రియుడు తారిక్ జోత్ సింగ్ 2021 మార్చిలో ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు.
ఈ ఘటనపై విచారణ చేపట్టిన స్థానిక కోర్టు ‘ప్రతీకార చర్య’లో భాగంగానే సజీవ సమాధి చేసినట్లు నిర్ధారించింది. ఈ ఘటనను ‘అసాధారణ స్థాయి క్రూరత్వం’గా అభివర్ణించిన కోర్టు నిందితుడికి జీవిత ఖైదు విధించే అవకాశం ఉంది. మనిషిలో మృగ స్వభావం ఏ మేరకు ఉంటుందో తారిక్ను చూసి తెలుసుకోవచ్చని వ్యాఖ్యానించింది.
పూడ్చిన చోటే సమాధి కట్టి నివాళి..
తారిక్ను తొలుత ప్రేమించిన తన కుమార్తె అతడి ప్రవర్తనలో మార్పును గమనించి దూరం పెట్టిందని.. దీన్ని తట్టుకోలేక అతడు ఎన్నోసార్లు వేధించాడని జాస్మిన్ కౌర్ తల్లి చెప్పారు. ఆమె చివరి క్షణాల్లో భరించిన మనో వేదనను తలచుకుంటే భయమేస్తోందన్నారు. జాస్మిన్ను ఉన్నత విద్య కోసం విదేశాలకు పంపించడమే తాను చేసిన తప్పు అని ఆవేదన చెందింది. జాస్మిన్ను ప్రేమోన్మాది పూడ్చి పెట్టిన చోటే ఆమె కుటుంబ సభ్యులు సమాధి కట్టి నివాళి అర్పిస్తున్నారు.