రాష్ట్రంలో దారుణం.. మహిళపై నలుగురి అత్యాచారయత్నం!

నాగర్ కర్నూలు జిల్లా బిజినపల్లి మండలం వెలుగొండలో దారుణ ఘటన చోటుచేసుకుంది. నలుగురు వ్యక్తులు మహిళపై హత్యాచారయత్నం చేశారు.

Update: 2024-10-04 16:30 GMT

దిశ, బిజినపల్లి: నాగర్ కర్నూలు జిల్లా బిజినపల్లి మండలం వెలుగొండలో దారుణ ఘటన చోటుచేసుకుంది. నలుగురు వ్యక్తులు మహిళపై హత్యాచారయత్నం చేశారు. ఈ విషయమై బాధిత మహిళ పోలీసులకు కంప్లైంట్ చేసింది. పోలీసుల వివరాల ప్రకారం.. బిజినపల్లి మండలంలోని వెలుగొండ గ్రామానికి చెందిన ఓ మహిళ గత ఆదివారం మధ్యాహ్నం ఇంట్లో భోజనం చేస్తుండగా.. అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ఇంట్లోకి వచ్చాడు. సదరు మహిళ కొడుక్కి రూ.20 ఇచ్చి కూల్ డ్రింక్ తీసుకురా అని బయటకు పంపాడు. అనంతరం బలవంతంగా మహిళపై అత్యాచారం చేయబోయాడు.

ఆ సమయంలో మహిళ గట్టిగా అరవడంతో అక్కడి నుంచి వెళ్లిపోయాడు. మళ్లీ అక్టోబర్ 2వ తేదీన సదరు మహిళ పనికి వెళ్తుండగా.. మరో ముగ్గురితో ఆమెను అడ్డగించి బలవంతంగా కాలువ పొదల్లోకి లాక్కెళ్లి మళ్లీ అత్యాచారం చేయబోయారు. ఆమె నిరాకరించడంతో ఒంటిమీదున్న బంగారం ఇవ్వాలని.. లేకపోతే తమకు సహకరించాలని ఇబ్బందులకు గురిచేశారు. దీంతో చేసేదేంలేక ఆమె.. ఒంటిమీదున్న బంగారం మొత్తం వారికి ఇచ్చింది. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరింపులకు గురిచేశారు. అనంతరం ఆమె అక్కడినుంచి వెళ్లిపోయింది. నేరుగా ఇంటికి వెళ్లి కుటుంబసభ్యులకు విషయం చెప్పి.. వారితో కలిసి పోలీస్ స్టేషన్‌కి వెళ్లి కంప్లైంట్ చేసిందని పోలీసులు వివరించారు.


Similar News