LIC: ఆరోగ్య బీమా రంగంలోకి ఎల్ఐసీ
చర్చలు చివరి దశలో ఉన్నాయి, మార్చి 31వ తేదీలోపు ఒప్పందం గురించి ప్రకటన వెలువడనున్నట్టు తెలిపారు.

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం ఎల్ఐసీ చాలాకాలంగా ఆరోగ్య బీమా రంగంలోకి అడుగుపెట్టాలని ప్రయత్నాలు చేస్తోంది. గతేడాది ఆఖరులో ఆరోగ్య బీమా కంపెనీలో వాటా కొనుగోలు ద్వారా ఈ వ్యాపారంలోకి ప్రవేశించాలని భావిస్తున్నట్టు సమస్థ సీఈఓ సిద్ధార్థ మొహంతి ఇదివరకు చెప్పారు. తాజాగా మరో రెండు వారాల్లో ఓ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీలో వాటాను కొనుగోలు చేయనున్నట్టు ఆయన ధృవీకరించారు. వాటా కొనుగోలు చేయాల్సిన కంపెనీని గుర్తించామని, దీనికి సంబంధించిన చర్చలు చివరి దశలో ఉన్నాయి, మార్చి 31వ తేదీలోపు ఒప్పందం గురించి ప్రకటన వెలువడనున్నట్టు తెలిపారు. మంగళవారం జరిగిన జీసీఏ25 కార్యక్రమంలో పాల్గొన్న సిద్ధార్థ మొహంతి విలేకరులతో మాట్లాడుతూ.. ఆరోగ్య బీమా కంపెనీ కొనుగోలుపై చర్చలు చివరి దశలో ఉన్నాయి. అయితే, సదరు కంపెనీలో మెజారిటీ వాటా 51 శాతం లేదా అంతకంటే ఎక్కువ కొనే ఆలోచన లేదు. ఎల్ఐసీ బోర్డు నిర్ణయం, సంస్థ వాల్యుయేషన్ ఆధారంగా ఎంత వాటా కొనాలనే దానిపై నిర్ణయం జరుగుతుందని మొహంతి స్పష్టం చేశారు. ఇదే సమయంలో ఏ కంపెనీలో వాటా కొననున్నది ఆయన చెప్పలేదు. అయితే, గతేడాది ఆఖరులో మణిపాల్సిగ్నా హెల్త్ ఇన్సూరెన్స్లో 50 శాతం వాటా కొనుగోలుకు ఎల్ఐసీ చర్చలు జరుపుతున్నట్టు వార్తలొచ్చాయి. ఈ కంపెనీ మణిపాల్ ఎడ్యుకేషన్ అండ్ మెడికల్ గ్రూప్, అమెరికాకు చెందిన సిగ్నా కార్పొరేషన్ల సంయుక్త సంస్థ.