NPCI: ఇన్యాక్టివ్ నంబర్లకు యూపీఐ సేవలు బంద్
ఇన్యాక్టివ్ నంబర్లను వాడుతున్న వినియోగదారులు గూగుల్పే, పేటీఎం, ఫోన్పే ఆన్లైన్ చెల్లింపుల యాప్లను ఉపయోగించలేరు

దిశ, బిజినెస్ బ్యూరో: వచ్చే నెల 1వ తేదీ నుంచి ఇన్యాక్టివ్ లేదా ఇతరులకు మార్చిన మొబైల్ నంబర్లకు యూపీఐ సేవలను నిలిచిపోతాయని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎన్పీసీఐ) తెలిపింది. దీనికి సంబంధించి బ్యాంకులు, పేమెంట్ సేవల కంపెనీలకు ఆదేశాలు జారీ చేసింది. దేశంలో అనధికారిక, మోసాలను నిలువరించేందుకు ఆయా నంబర్లను డీయాక్టివేట్ చేయాలని స్పష్టం చేసింది. దీంతో ఇన్యాక్టివ్ మొబైల్ నంబర్లను వాడుతున్న వినియోగదారులు గూగుల్పే, పేటీఎం, ఫోన్పే మొదలైన ఆన్లైన్ చెల్లింపుల యాప్లను ఉపయోగించలేరు. ప్రస్తుతం యూపీఐ సేవలను వాడేందుకు మొబైల్ నంబర్ తప్పనిసరి. దీనికోసం ఓటీపీ వెరిఫికేషన్ కీలకం. ఈ కారణంగానే ఎన్పీసీఐ తాజా నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించింది. ఎన్పీసీఐ ఆదేశాల ప్రకారం, మొబైల్ నంబర్ మార్చినప్పటికీ బ్యాంకుల్లో అప్డేట్ చేయని వారిపై, యూపీఐతో అనుసంధానం చేసి కాల్స్, మెసేజ్లు చేయకుండా ఉన్న నంబర్లపై ప్రభావం ఉండనుంది. అలాగే, పాత నంబర్ను మరొకరికి ఇచ్చేసి, యూపీఐ సేవలను అదే నంబర్తో కొనసాగించే వారిపై తాజా ఆదేశాలు ప్రభావం చూపనున్నాయి. ఎక్కువ కాలంపాటు ఏవైన మొబైల్ నంబర్లను వాడకపోతే టెలికాం కంపెనీలు ఆ నంబర్ను మరొకరికి కేటాయిస్తాయి. అలాంటి సందర్భాల్లో యూపీఐ అకౌంట్లు కూడా మారిపోయే ప్రమాదం ఉంటుంది. ఫలితంగా మోసపూరిత లావాదేవీలు జరగవచ్చు. ఇలాంటి సమస్యల నివారణకే ఎన్పీసీఐ ఇన్యాక్టివ్ నంబర్లకు యూపీఐ సేవలను నిలిపేయాలని నిర్ణయించింది.