Breaking: నటి జత్వానీ కేసులో విద్యాసాగర్ అరెస్ట్

నటి జత్వానీ కేసులో వైసీపీ మాజీ నేత విద్యాసాగర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు..

Update: 2024-09-20 11:27 GMT

దిశ, వెబ్ డెస్క్: నటి జత్వానీ కేసులో వైసీపీ నేత విద్యాసాగర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. జగన్ ప్రభుత్వ హయాంలో తమ కుటుంబంపై అక్రమంగా కేసులు పెట్టి వేధించారని విద్యాసాగర్‌తో పాటు పలువురు పోలీసు అధికారులపై ముంబై నటి జత్వానీ విజయవాడలో ఇటీవల ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. దీంతో కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేశారు. అయితే ఈ కేసులో తాజాగా కీలక పరిణామం చోటు చేసుకుంది. పరారీలో ఉన్న ప్రధాన నిందితుడు విద్యాసాగర్‌ను పోలీసులు డెహ్రాడూన్‌లో అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఆయన్ను ఏపీకి తీసుకొస్తున్నారు. అనంతరం కోర్టులో ప్రవేశపెట్టే అవకాశం ఉంది.

కాగా ముంబైలో తనను విద్యాసాగర్ నమ్మించి మోసం చేశారని నటి కాదంబరి జత్వానీ ఆరోపించారు. పెళ్లి ఫంక్షన్‌లో పరిచయమైన ఆయన తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి.. ఆ తర్వాత తప్పించుకునే ప్రయత్నం చేయడంతో తాను నిలదీశానని, దాంతో ఏపీలో తనపై, తన కుటుంబ సభ్యులపై అక్రమంగా కేసులు పెట్టారని నటి జత్వానీ ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాదు ఆ కేసులు పెట్టడంలో పోలీస్ ఉన్నతాధికారుల పాత్ర ఉందని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఉండటంతో తనకు న్యాయం జరుగుతుందని, అందుకే విజయవాడలో పోలీసులకు ఫిర్యాదు చేశానని జత్వానీ స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం సీరియస్ అయింది. నిందితులపై కేసులు పెట్టాలని పోలీసులను ఆదేశించింది. దీంతో కేసులు నమోదు చేసి నిందితుడు విద్యాసాగర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. 


Similar News