AP News: మందుబాబులకు గుడ్‌న్యూస్..ఏంటంటే..?

మద్యం పాలసీపై కొత్త ప్రభుత్వం సమాలోచనలు జరుపుతోంది.

Update: 2024-06-10 03:31 GMT

దిశ ప్రతినిధి, విశాఖపట్నం: మద్యం పాలసీపై కొత్త ప్రభుత్వం సమాలోచనలు జరుపుతోంది. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కొద్దిరోజుల్లోనే కొత్త మద్యం విధానాన్ని ప్రకటించేందుకు అధికారులు ఇప్పటికే కసరత్తు ప్రారంభించారు. సంపూర్ణ మద్య నిషేధంలో భాగం అంటూ వైసీపీ ప్రభుత్వం ధరలను విపరీతంగా పెంచింది.

అంతేగాక అప్పటి వరకూ ఉన్న పేరొందిన బ్రాండ్‌లను పక్కనపడేసి, స్ధానిక వైసీపీ నేతలతో డిస్టలరీలు తెరిపించి, ఇక్కడ తయారు చేసిన నాసిరకం మద్యం సరఫరా చేసింది. వైసీపీ నేతలకు మేలు చేసే లోపభూయిష్టమైన ఈ మద్యం పాలసీని రద్దు చేస్తూ నూతన ప్రభుత్వం కొత్త పాలసీని ముందుకు తేనుంది.

తెరపైకి టెండర్ సిస్టమ్

రాష్ట్రంలో ఉన్న 3,600 మద్యం దుకాణాలకు టెండర్ సిస్టం ద్వారా ఇవ్వాలని భావిస్తున్నారు. ఇప్పుడు ప్రభుత్వమే వైన్ షాప్‌లను నడుపుతోంది. టెండర్ విధానంలో రూరల్ ప్రాంతంలో ఒక షాప్‌కి 45,000, అర్బన్ ఏరియాలో 55000 రూపాయలు డిపాజిట్ చేసే విధంగా నిబంధనలను తీసుకురానున్నారనే ప్రచారం జరుగుతోంది. కల్తీ లేని మధ్యాన్ని, దేశ వ్యాప్తంగా పేరున్న పాత బ్రాండ్లను వినియోగదారుడికి అందించే విధంగా మార్పులు తీసుకురానున్నారు.

గత ప్రభుత్వంలో ఊరు పేరు లేని డిస్టలరీస్‌కు పర్మిషన్ ఇవ్వడంతో ఇష్టారాజ్యంగా దోపిడీ చేసిన జగన్ ప్రభుత్వంపై విచారణ కూడా జరపనున్నామని కొత్త ప్రభుత్వ పెద్దలు ఇప్పటికే చెప్పారు. ఇందుకు సంబంధించి హైదరాబాద్‌లోని సంబంధిత అధికారి వాసుదేవ రెడ్డి ఇంటిపై సీఐడీ దాడులు కూడా జరిపి రికార్డులు స్వాధీనం చేసుకొంది. విశాఖతో పాటు రాష్ర్ట వ్యాప్తంగా బార్‌లు, అక్రమంగా నడుస్తున్న పబ్‌లపై శనివారం అర్ధరాత్రి నుంచి దాడులు జరుగుతున్నాయి.


Similar News