AP:వైసీపీ పాలనలో సాగునీటి ప్రాజెక్టులు నిర్వీర్యం.. మంత్రి నిమ్మల సంచలన వ్యాఖ్యలు

గత వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యం జిల్లా రైతాంగానికి శాపంగా మారింది. అప్పట్లో జగన్‌ తీసుకున్న అడ్డగోలు నిర్ణయాల వల్ల రాయలసీమ సాగునీటి ప్రాజెక్టులకు గ్రహణం పట్టుకుంది అని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు.

Update: 2024-09-22 10:41 GMT

దిశ, నందికొట్కూరు:గత వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యం జిల్లా రైతాంగానికి శాపంగా మారింది. అప్పట్లో జగన్‌ తీసుకున్న అడ్డగోలు నిర్ణయాల వల్ల రాయలసీమ సాగునీటి ప్రాజెక్టులకు గ్రహణం పట్టుకుంది అని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. ఆదివారం ఉమ్మడి కర్నూలు జిల్లాలోని నందికొట్కూరు మండలం మల్యాల వద్ద నిర్మించిన హంద్రీనీవా ఎత్తిపోతల పథకాన్ని సందర్శించారు. నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య , జలవనరుల శాఖ అధికారులు మంత్రికి ఘన స్వాగతం పలికారు. హంద్రీనీవా ఎత్తిపోతల పథకం అమలు తీరును మ్యాప్ ద్వారా అధికారులు మంత్రికి వివరించారు. పంపు మోటర్లను వాటి పని తీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే జయసూర్య తో కలిసి మంత్రి రామానాయుడు గంగమ్మకు జల హారతి ఇచ్చారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ రాయలసీమలో 700 కి.మీ పొడవైన ఎత్తిపోతల పథకం హంద్రీనీవా పథకం. రాయలసీమ నాలుగు జిల్లాల్లో రైతాంగానికి సాగు తాగునీరు అందించడమే పథకం ఉద్దేశం. ఉమ్మడి కర్నూలు జిల్లా మల్యాల నుంచి అనంతపురం జిల్లాలోని కుప్పం వరకు 3850 క్యూసెక్కుల సామర్థ్యంతో ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ప్రతి ఏడాది 60 టీఎంసీల నీటిని హంద్రీనీవా ద్వారా రైతాంగానికి అందించేలా రూపొందించడం జరిగిందని తెలిపారు. అయితే గత వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా 30 టీఎంసీల నీటిని కూడా తీసుకెళ్ళే పరిస్థితి కూడా లేకుండా పోయిందని పేర్కొన్నారు. హంద్రీనీవా ద్వారా పూర్తి స్థాయిలో రైతులకు సాగునీరు అందిస్తామని హామీ ఇచ్చారు. వైసీపీ పాలనలో సాగునీటి ప్రాజెక్టులను పూర్తిగా నిర్వీర్యం చేసిందని దుయ్యబట్టారు.

గతంలో 2014 నుంచి 2019 వరకు టీడీపీ ప్రభుత్వంలో ఇరిగేషన్ కొరకు బడ్జెట్లో రూ.7లక్షల కోట్లు కేటాయించి రూ.72 వేల కోట్లు ఖర్చు చేస్తే వైసీపీ ప్రభుత్వం 2019 నుంచి 2024 వరకు రూ. 12 లక్షల కోట్లు కేటాయించి కేవలం రూ.49 వేల కోట్లు మాత్రమే ఖర్చు చేసి చరిత్ర వైసీపీదే అన్నారు. ఇందులో కూడా వైసీపీ ప్రభుత్వం రూ.31 వేల కోట్లు ఖర్చు చేసినట్లు లెక్కలు చూపి అందులో భారీ ఎత్తున అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. సాగునీటి ప్రాజెక్టుల కోసం టీడీపీ ప్రభుత్వం 9.6శాతం నిధులు కేటాయిస్తే అదే వైసీపీ పాలనలో కేవలం 2.5 శాతం కేటాయించిందని తెలిపారు. రాయలసీమ ప్రాజెక్టులకు టీడీపీ ప్రభుత్వం దాదాపు రూ.12వేల కోట్లు కేటాయిస్తే వైసీపీ ప్రభుత్వం ఐదేళ్ళలో కేవలం 2011 కోట్లు కేటాయించి చేతులు దులుపుకొన్నారు అన్నారు. 2014, 2019లో హంద్రీనీవాకు తెలుగుదేశం ప్రభుత్వం రూ.4182 కోట్లు ఖర్చు పెట్టితే అదే వైసీపీ ప్రభుత్వం ఐదేళ్ళలో కేవలం రూ.515 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు.


Similar News