సనాతనం అంటే పవన్ కల్యాణ్‌కు తెలుసా..?: జగన్

ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి.. అసలు పవన్ కల్యాణ్‌కి సనాతన ధర్మం అంటే తెలుసా..? అని ప్రశ్నించారు

Update: 2024-10-04 10:50 GMT

దిశ, వెబ్‌డెస్క్: సనాతన ధర్మాన్ని ఎవరు దెబ్బతీయాలని చూసినా తాను సహించనని, సనాతన ధర్మ రక్షణ కోసం తాను పోరాడతానని ఏపీ డిప్యూటీ సీఎం ఈ మధ్య అనేక సందర్భాల్లో వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై తాజాగా మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి మీడియా ముఖంగా స్పందించారు. ఈ రోజు (శుక్రవారం) తాడేపల్లిలోని తన నివాసంలో మీడియాతో మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి.. అసలు పవన్ కల్యాణ్‌కి సనాతన ధర్మం అంటే తెలుసా..? అని ప్రశ్నించారు. చంద్రబాబు తప్పు చేశారని కళ్లెదుటే కనిపిస్తుంటే, వేంకటేశ్వర స్వామి ప్రతిష్ఠను, లడ్డూ విశిష్టతను తగ్గిస్తూ.. కావాలని రాజకీయ దుర్బుద్ధితో కోట్ల మంది హిందువుల మనోభావాలను చంద్రబాబు దెబ్బతీస్తుంటే.. దాన్ని ఖండించడం మానేసి.. అందులో పవన్ కూడా భాగమయ్యారని, బాబుతో కలిసి అబద్ధపు ఆరోపణలు చేస్తూ ముందుకు అడుగులు వేస్తున్నారని, ఇదెలా సనాతన ధర్మాచరణ అవుతుందని జగన్ ప్రశ్నించారు. అబద్ధాలకు మద్దతుగా నిలుస్తున్న వ్యక్తి సనాతన ధర్మం గురించి మాట్లాడడం ఏంటని నిలదీశారు. తప్పు అని తెలిసినా.. దాన్ని ఎత్తి చూపకపోగా.. తప్పును గుడ్డిగా సమర్థిస్తూ.. అందులోనూ దేవుడి విషయంలో తప్పు చేస్తూ.. అదే సనాతనం అని చెప్పడం ఎంత వరకు ధర్మమని జగన్మోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.


Similar News