విశాఖకు వేళాయేరా.. రాజధాని తరలింపునకు రంగం సిద్ధం

విశాఖకు రాజధాని తరలింపులో వైసీపీ ప్రభుత్వం దూకుడు పెంచిందా?

Update: 2023-11-01 05:58 GMT

దిశ, డైనమిక్ బ్యూరో : విశాఖకు రాజధాని తరలింపులో వైసీపీ ప్రభుత్వం దూకుడు పెంచిందా? ఎప్పుడైనా తాను విశాఖకు వెళ్లేందుకు సిద్ధం అని సీఎం వైఎస్ జగన్ ప్రకటించిన నేపథ్యంలో అధికార యంత్రాంగం పనుల్లో స్పీడ్ పెంచిందా? ఇప్పటికే సీఎం నివాసం, క్యాంపు కార్యాలయంతోపాటు ఇతర పరిపాలన భవనాల ఎంపికకు రంగం సిద్ధమైందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. విశాఖ నుంచి పాలన దిశగా వైసీపీ ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తుంది. విశాఖలో పరిపాలన భవనాల ఎంపికకు సంబంధించి ప్రభుత్వం నియమించిన కమిటీ భవనాల ఎంపిక ప్రక్రియను పూర్తి చేసింది. ఇక అనుమతులే తరువాయి. ఇకపోతే ఇప్పటికే సీఎం వైఎస్ జగన్ రాజధాని తరలింపు ప్రక్రియకు తాను సిద్ధం అని ప్రకటించిన నేపథ్యంలో సీఎంవో అధికారులు సైతం అందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతో రాష్ట్రంలో రాజధాని తరలింపునకు వేళాయేరా అంటూ ప్రచారం జరుగుతుంది.

భవనాలు గుర్తింపు

ఏపీ పరిపాలన రాజధానిగా విశాఖను సీఎం వైఎస్ జగన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. గత కొన్నాళ్లుగా అదిగో వెళ్లిపోతున్నాం.. ఇదిగో రాజధాని విశాఖకు తరలిపోతుందంటూ వైసీపీ ప్రకటనలు చేస్తోంది. ఇప్పటికే ప్రకటనలు విశాఖలో ట్రాన్సిట్ అకామిడేషన్ కమిటీ నివేదిక సిద్ధం చేసింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు మంగళవారం తుది నివేదిక అందజేసింది. విశాఖలో సీఎం క్యాంపు ఆఫీసు కోసం గుర్తించిన వివిధ భవనాల వివరాలను అధికారుల కమిటీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌‌కి వివరించింది. రాష్ట్ర సమగ్రాభివృద్ధిలో భాగంగా ఉత్తరాంధ్ర అభివృద్ధిపై ముఖ్యమంత్రి పర్యవేక్షణ, సమీక్ష సమావేశాల నిర్వహణకు విశాఖలో క్యాంపు కార్యాలయం చూస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మంగళవారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన సమావేశంలో విశాఖలో గుర్తించిన భవనాల వివరాలను సీఎం వైఎస్‌ జగన్‌కు కమిటీ వివరించింది. రాష్ట్ర ప్రభుత్వంలోని సీనియర్‌ అధికారులు సహా, ఇతర అధికారులు తమ కార్యకలాపాలు నిర్వహించడానికి అవసరమైన భవనాలను కూడా గుర్తించినట్లు తెలిపింది. విశాఖలో ఇప్పటికే వివిధ ప్రభుత్వ విభాగాలు, వాటి కార్యాలయాలు 2,27,287 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్నాయని కమిటీ తెలిపింది. వీటిలో సీనియర్‌ అధికారులకు అవసరమైన క్యాంపు కార్యాలయాలు ఏర్పాటు చేసుకుని కార్యకలాపాలు నిర్వహించుకోవచ్చని స్పష్టం చేసింది. వారి వసతికి కూడా ఆయా విభాగాల పరిధిలో ఉన్నవాటిని వినియోగించుకోవచ్చని పేర్కొంది. ఇకపోతే ఐటీ హిల్‌పై ఉన్న మిలీనియం టవర్‌లో అందుబాటులో ఉన్న 1,75,516 అడుగుల విస్తీర్ణంలో మిగిలిన సీనియర్‌ అధికారులు క్యాంపు కార్యాలయాలు ఏర్పాటు చేసుకోవచ్చని సుస్పష్టం చేసింది. ఇంకా కొంతమంది అధికారుల కోసం, వారి కార్యాలయాల కోసం మరికొన్ని ప్రైవేటు భవనాలను గుర్తించామని కమిటీ వెల్లడించింది. ఈ మేరకు 3,98,600 చదరపు అడుగుల విస్తీర్ణాన్ని గుర్తించామని..ప్రభుత్వంలోని సీనియర్‌ అధికారుల కార్యకలాపాలు, వారి వసతి కోసం ప్రభుత్వ భవనాలు, ప్రైవేటు భవనాల్లో మొత్తం 8,01,403 చదరపు అడుగుల విస్తీర్ణాన్ని గుర్తించినట్లు కమిటీ సీఎం జగన్‌కు వివరించింది.

 

ఐదు రకాల భవనాలు పరిశీలన

ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం, వసతి కోసం ఐదు రకాల భవనాలను గుర్తించినట్టు అధికారుల కమిటీ సీఎం వైఎస్ జగన్‌కు తెలియజేసింది. ఏయూ డిస్టెన్స్‌ ఎడ్యుకేషన్, ఓపెన్‌ వర్సిటీ బ్లాకులు, సిరిపురంలోని వీఎంఆర్‌డీఏ భవనాలు, మిలీనియం ఎ–టవర్, మిలీనియం బి–టవర్, రుషికొండలోని టూరిజం రిసార్టులను గుర్తించినట్లు తెలిపింది. ముఖ్య­మంత్రి క్యాంపు కార్యాలయం, వసతి, అధికారులతో సమావేశాల కోసం సరిపడా గదులు, భద్రతా సిబ్బంది ఉండేందుకు సదుపాయాలు, ఇలా అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకున్నామని కమిటీ స్పష్టం చేసింది.అలాగే ప్రధానంగా ట్రాఫిక్‌కు ఇబ్బంది లేకుండా, ప్రజలకు ఎలాంటి అసౌకర్యం లేకుండా, ముఖ్యమంత్రికి భద్రత తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈ భవనాల ఎంపిక ప్రక్రియ జరిగిందని తెలిపారు. ట్రాఫిక్‌ దృష్ట్యా, యూనివర్సిటీ అకడమిక్‌ కార్యకలాపాలకు ఇబ్బంది కలుగుతుందనే ఉద్దేశంతో యూనివర్సిటీ భవనాలను పరిగణనలోకి తీసుకోలేదని కమిటీ వెల్లడించింది. అలాగే మిలీనియం టవర్‌లో ఒక దాంట్లో ఇప్పటికే కొన్ని కంపెనీలు నడుస్తున్నాయని, రెండో టవర్‌ కూడా ఆఫీసుకు సరిపోయినా, సీఎం వసతికి సరిపోదని, భద్రతా కారణాల వల్ల దాన్ని కూడా పరిగణలోకి తీసుకోలేదని వెల్లడించింది.

రుషికొండపై భవనాలు అనుకూలం

ఇకపోతే రుషికొండ వద్ద నిర్మించిన రిసార్టుల కోసం నిర్మించిన భవనాలు సీఎం క్యాంపు కార్యాలయంకు అత్యంత అనుకూలంగా ఉంటాయని కమిటీ తెలిపింది. వీఐపీల రాకపోకల వల్ల స్థానికులకు ఎలాంటి అవాంతరాలు ఏర్పడవని అలాగే నగరంలో ట్రాఫిక్‌ సమస్య కూడా తలెత్తని తెలిపింది. పార్కింగ్, ఆఫీసు, వసతి, భద్రతా సిబ్బందికి, సీఎం సెక్రటరీల కార్యకలాపాలకు, ఈ భవనాలు అత్యంత అనుకూలంగా ఉన్నాయని స్పష్టం చేసింది. అలాగే హెలిప్యాడ్‌ కూడా సమీపంలోనే ఉండటం మరింత కలిసి వచ్చే అంశమని అధికారుల కమిటీ తెలిపింది. 



Tags:    

Similar News