BREAKING: రాష్ట్రంలో టీడీపీ, బీజేపీ, జనసేనల హనీమూన్ నడుస్తోంది: మాజీ సీఎం జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు

రాష్ట్రంలో టీడీపీ, బీజేపీ, జనసేనల హనీమూన్ నడుస్తోందని మాజీ సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Update: 2024-06-13 07:54 GMT

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో టీడీపీ, బీజేపీ, జనసేనల హనీమూన్ నడుస్తోందని మాజీ సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ తాడేపల్లి‌ పార్టీ ఆఫీసులో ఆయన ఎమ్మెల్సీలతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభత్వ ప్రలోభాలకు లొంగకూడదని ఎమ్మెల్సీలకు ఆయన సూచించారు. అధికారం ఉన్నా లేకపోయినా మనం ప్రజా క్షేత్రంలోని ఉంటామని, ఎవరు ఎన్ని కేసులు పెట్టినా భయపడొద్దని అన్నారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో 40 శాతం మంది ప్రజలు వైసీపీ వైపే ఉన్నారని వారి అండతో ప్రభుత్వ తప్పొప్పులను ఒప్పటికప్పుడు ఎండగడుతూ.. ప్రజా క్షేత్రంలోకి వెళ్తామని పేర్కొన్నారు.

ప్రభుత్వం చేసిన మంచి పనులు ఇప్పటికి ప్రజల గుండెల్లో ఉన్నాయని తెలిపారు. అదేవిధంగా ఎన్నికల ఫలితాలు శకుని పాచికల మాదిరిగా ఉన్నాయని, ఈవీఎంలపై దేశ వ్యాప్తంగా చర్చ జరగాలని అన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో టీడీపీ, బీజేపీ, జనసేనల హనీమూన్ నడుస్తోందని చలోక్తులు విసిరారు. రాష్ట్రంలో ఏర్పడిన కొత్త ప్రభుత్వానికి కొంత సమయం ఇద్దామని ఎమ్మెల్సీలకు సూచించారు. అసెంబ్లీలో మన నోరును కట్టడి చేసే అవకాశం ఉందని, అందుకే ఎమ్మెల్సీ సంఖ్య ఎక్కువగా ఉన్న మండలిలో కూటమి ప్రభుత్వంపై పోరాటం చేద్దామని జగన్ పిలుపునిచ్చారు.  

Tags:    

Similar News