‘మూడో దశ’ ఎన్నికలకు నామినేషన్ల స్వీకరణ ప్రారంభం.. ఏయే రాష్ట్రాల్లో పోలింగ్ జరగనుందంటే..?

ఇప్పటికే తొలి దశ, రెండో దశకు సంబంధించిన నామినేషన్ల ప్రక్రియ పూర్తయిన విషయం తెలిసిందే.

Update: 2024-04-11 16:49 GMT

దిశ, నేషనల్ బ్యూరో: మూడో దశ లోక్‌సభ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ శుక్రవారం నుంచి మొదలుకానుంది. ఇందుకు సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్‌ను కేంద్ర ఎన్నికల సంఘం శుక్రవారం ఉదయం విడుదల చేయనుంది. దేశంలో మొత్తం ఏడు దశల్లో లోక్‌సభ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఇప్పటికే తొలి దశ, రెండో దశకు సంబంధించిన నామినేషన్ల ప్రక్రియ పూర్తయిన విషయం తెలిసిందే. మూడో దశ నామినేషన్ల స్వీకరణ శుక్రవారం మొదలై, వచ్చే శుక్రవారం(ఈ నెల 19)తో ముగియనుంది. 20న నామినేషన్ల పరిశీలన ఉండగా, 22న ఉపసంహరణకు అవకాశం ఇవ్వనుంది.

గుజరాత్‌లో సింగిల్ ఫేజ్

మూడో దశలో 12 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లోని(యూటీ) 94 నియోజకవర్గాలకు వచ్చే నెల 7న పోలింగ్ జరగనుంది. గుజరాత్‌‌కు మూడో దశలోనే పోలింగ్ పూర్తికానుంది. రాష్ట్రంలో మొత్తం 26 లోక్‌సభ నియోజకవర్గాలు ఉండగా, అన్ని స్థానాలకూ ఇదే దశలో పోలింగ్ జరగనుంది. గుజరాత్‌తోపాటు కర్ణాటకలోకి 14 స్థానాలు, మహారాష్ట్రలోని 11 నియోజకవర్గాలు, యూపీలో 10 సీట్లు, మధ్యప్రదేశ్‌లో 8 స్థానాలు, ఛత్తీస్‌గఢ్‌లో 7 స్థానాలు, బిహార్‌లో 5 స్థానాలు, అసోం, బెంగాల్‌లో నాలుగేసి నియోజకవర్గాలు, గోవా, దాద్రా నగర్ హవేలి అండ్ డామన్ డయ్యూలోని రెండేసి స్థానాలు, జమ్మూ కశ్మీర్‌లో ఒక్కో స్థానానికి మూడో దశలో పోలింగ్ జరగనుంది.

లోక్‌సభ ఎన్నికల ‘మూడో దశ’ షెడ్యూల్

నోటిఫికేషన్‌: 12 ఏప్రిల్, 2024

నామినేషన్ల స్వీకరణకు చివరి తేదీ: 19 ఏప్రిల్

నామినేషన్ల పరిశీలన: 20 ఏప్రిల్

ఉపసంహరణకు ఆఖరు తేదీ: 22 ఏప్రిల్

పోలింగ్‌ తేదీ: 07 మే

కౌంటింగ్/ఫలితాలు: 04 జూన్


Similar News