మహబూబ్‌నగర్‌లో వెనుకబడిన బీఆర్ఎస్.. ప్రచారంలో ‘మన్నె’కు నో సపోర్ట్!

మహబూబ్‌నగర్ పార్లమెంటు సెగ్మెంటులో అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్‌చార్జిలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేల నిర్లిప్తతతో బీఆర్ఎస్ ప్రచారం నత్తనడకన సాగుతోంది.

Update: 2024-04-12 03:10 GMT

దిశ, మహబూబ్‌నగర్ బ్యూరో: మహబూబ్‌నగర్ పార్లమెంటు సెగ్మెంటులో అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్‌చార్జిలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేల నిర్లిప్తతతో బీఆర్ఎస్ ప్రచారం నత్తనడకన సాగుతోంది. మొత్తం ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒక్క పార్టీ ఎమ్మెల్యే కూడా లేక ఇప్పటికే నిరాశలో ఉన్న గులాబీ శ్రేణులు తాజాగా స్థానిక నేతల తీరుతో మరింత నైరాశ్యం నెలకొన్నది. మృదుస్వభావిగా ఉన్న సిట్టింగ్ ఎంపీ మన్నె శ్రీనివాస్ రెడ్డిని మార్చి కొత్తవారికి అవకాశం ఇవ్వాలని అధిష్టానం పలువురి పేర్లను పరిశీలించినప్పటికీ వారు పోటీకి ఆసక్తి చూపకపోవడంతో తప్పని పరిస్థితులలో శ్రీనివాస్ రెడ్డికి మరో అవకాశం ఇచ్చింది.

పోటీ నామమాత్రమేనా?

ఒకానొక సందర్భంలో శ్రీనివాస్ రెడ్డి పోటీలో ఉంటారా లేదా అన్న సందేహాలు కూడా వ్యక్తం అయ్యాయి. ఒకవైపు కాంగ్రెస్, మరోవైపు బీజేపీ అభ్యర్థులు పోటాపోటీగా ప్రచారం చేస్తున్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి మాత్రం వెనుకబడిపోయారని, ఎన్నికల్లో ఆ పార్టీ ప్రభావం నామమాత్రమే అన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రచారంలో కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు కూడా బీఆర్ఎస్‌ గానీ, ఆ పార్టీ క్యాండిడేట్‌ గానీ పోటీలో ఉన్నారన్న విషయాన్ని ప్రస్తావించడం లేదు. ఎలాంటి విమర్శలు కూడా చేయకపోవడం గమనార్హం.

కేడర్‌లో నిరుత్సాహం..

గత పార్లమెంటు ఎన్నికలలో వెన్నంటి ఉండి గెలుపులో ప్రధాన భూమిక పోషించిన ఆయన సోదరుని కుమారుడు జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరడంతో పార్టీ క్యాడర్‌లో మరింత నిరుత్సాహం నెలకొన్నది. దీంతో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి ఇప్పటివరకు చెప్పుకోదగిన స్థాయిలో ప్రచార కార్యక్రమాలను నిర్వహించలేదు. ఎన్నికలకు పార్టీ కేడర్‌ను సన్నద్ధం చేసిన దాఖలాలూ లేవు. అధిష్టానం ఇటీవల సమావేశాలు నిర్వహించి ఎన్నికలలో సత్తా చాటాలని సూచించింది. కానీ మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అడపాదడపా ఎంపీ శ్రీనివాస్ రెడ్డితో కొన్ని కార్యక్రమాలకు హాజరవుతున్నారు తప్ప.. మిగిలిన ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల మాజీ ఎమ్మెల్యేలు చెప్పుకోదగిన స్థాయిలో ఎన్నికలకు పార్టీ శ్రేణులను సిద్ధం చేయడం లేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

Tags:    

Similar News