మితంగా తాగినా తప్పని క్యాన్సర్ ముప్పు!

by Shyam |
Alcohol
X

దిశ, ఫీచర్స్: ‘మద్యపానం ఆరోగ్యానికి హానికరం’ అని ఆయా బాటిల్స్‌పైనే ఉన్నా గానీ లెక్కచేయం. ఈ రోజుల్లో తాగడం ఓ ఫ్యాషన్‌గా మారిపోగా.. మద్యానికి బానిసలైన ప్రతీ 10 మందిలో ఇద్దరికి కాలేయ సమస్యలు వస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే అనేక అధ్యయనాలు ‘డ్రింకింగ్’ వల్ల కలిగే దుష్ప్రభావాలను వెల్లడించగా.. తాజాగా మరో అధ్యయనం ఆల్కహాల్ వల్ల తలెత్తే అనారోగ్య సమస్యల గురించి వివరించింది. మద్యపానం వల్ల శరీరంలో హానికరమైన రసాయనాల ఉత్పత్తి పెరిగి డీఎన్‌ఏ(DNA) దెబ్బతింటుందని, ఇది క్యాన్సర్ కణాల అభివృద్ధికి దోహదపడే హార్మోన్ల ఉత్పత్తిని ప్రభావితం చేస్తుందని పరిశోధకులు తెలిపారు.

భారతదేశంలో గతేడాది వెలుగుచూసిన క్యాన్సర్ కేసుల్లోని 62,100 లేదా 5 శాతం కేసుల్లో మద్యపానం‌తో సంబంధం కలిగి ఉన్నట్టుగా ‘ది లాన్సెట్ ఆంకాలజీ జర్నల్‌’లో ప్రచురించిన అధ్యయనంలో వెల్లడైంది. దేశంలో రోజురోజుకూ మద్యంప్రియుల సంఖ్య పెరగుతుండగా, ఆ ప్రభావంతో అనారోగ్యం బారినపడేవారూ అధికమవుతున్నారని తేలింది. అదే ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే 2020కు సంబంధించి 7,40,000 లేదా నాలుగు శాతం కొత్త క్యాన్సర్ కేసులకు మద్యపానం కారణమని పరిశోధకులు వెల్లడించారు. మహిళలతో పోలిస్తే, ఆల్కహాల్-సంబంధిత క్యాన్సర్ కేసుల్లో పురుషులే అధికంగా ఉన్నారని (77 శాతం – 568,700 కేసులు) ఈ అధ్యయనం అంచనా వేసింది. గత డేటాను పరిశీలించినట్టయితే.. 2020లో నోరు, ఫారింక్స్, వాయిస్ బాక్స్ (స్వరపేటిక), ఓసోఫాగియల్, కొలన్ (పెద్దపేగు), పురీషనాళం, కాలేయం, రొమ్ము క్యాన్సర్ కేసులు అధికంగా ఉండగా, మొత్తం మీద 6.3 మిలియన్ క్యాన్సర్ కేసులు ఆల్కహాల్ కారణంగా సంభవించినట్లు తేలింది.

అనేక యూరోపియన్ దేశాల్లో మద్యపానం తాగే వారి సంఖ్య తగ్గిపోగా.. చైనా, ఇండియా వంటి ఆసియా దేశాలతో సహా ఉప-సహారా ఆఫ్రికాలో మద్యపానం తీసుకునే వారి సంఖ్య పెరిగిందని ఫ్రాన్స్‌కు చెందిన ఇంటర్నేషనల్ ఫర్ క్యాన్సర్ పరిశోధకులు హ్యారియెట్ రంగే తెలిపారు. కొవిడ్ 19 మహమ్మారి కాలంలో ఈ నెంబర్స్ మరింత పెరిగాయని ఆయన అన్నారు. ఈ మేరకు ఆల్కహాల్ సేవనం, క్యాన్సర్ల మధ్య సంబంధాల గురించి ప్రజల్లో మరింత అవగాహన కల్పించాలని, దాని వినియోగాన్ని తగ్గించడానికి ప్రభుత్వ జోక్యం పెరగాలని పరిశోధకులు సూచించారు. అంతేకాదు తక్కువ స్థాయిలో తాగినా భవిష్యత్తులో అది క్యాన్సర్ రేటును ప్రభావితం చేస్తుందని స్టడీలో వెల్లడైంది.

రోజులో రెండు పెగ్గులు తీసుకోవడం మిత మద్యపానంగా పరిగణిస్తే.. 2 -6 పెగ్గుల వరకు ప్రమాదకర మద్యపానంగా, 6 కంటే ఎక్కువ పెగ్గులైతే హెవీ‌ డ్రింకింగ్‌గా వర్గీకరించారు. 2020లో నమోదైన 741,300 కేసుల్లో ప్రమాదకర మద్యపానం తీసుకున్న వారిలో క్యాన్సర్ కేసులు 39 శాతం (291,800 కేసులు)నమోదు కాగా, హెవీ డ్రింకర్స్‌లో 47 శాతం (346,400 కేసులు)గా నమోదయ్యాయి. ఏదేమైనా మితంగా తాగినా సమస్యాత్మకమే అని తేలగా.. ఈ తరహా కేసులు 14 శాతం (103,100 కేసులు)గా నమోదైనట్టు అంచనా. ఇక భారత్‌లో 5 శాతం (62,100) క్యాన్సర్ కేసులు మద్యంతో ముడిపడి ఉండగా, చైనా 6 శాతం (282,300), జర్మనీ 4 శాతం (21,500 కేసులు), ఫ్రాన్స్‌లో 5 శాతం (20,000 కేసులు) ఉన్నాయి.

Advertisement

Next Story

Most Viewed