అగ్గిరాజేసిన ఇంధన మంట : ఏఐటీయూసీ

by Shyam |
అగ్గిరాజేసిన ఇంధన మంట : ఏఐటీయూసీ
X

దిశ ప్ర‌తినిధి, హైద‌రాబాద్ : పెట్రోల్ ,డీజిల్ ధ‌ర‌ల పెంపును నిర‌సిస్తూ ఏఐటీయూసీ ఆధ్వ‌ర్యంలో హిమాయ‌త్ న‌గ‌ర్ వై జంక్ష‌న్ లో ఆటో డ్రైవ‌ర్లు నిర్వ‌హించిన నిర‌స‌న కార్య‌క్ర‌మం ఉద్రిక్త‌త‌కు దారి తీసింది. ఈ సంద‌ర్భంగా కేంద్ర ప్ర‌భుత్వం దిష్టి బొమ్మ‌ను ద‌హ‌నం చేసే ప్ర‌క్రియ‌లో భాగంగా ఇద్ద‌రు ఆటో డ్రైవ‌ర్ల‌కు మంట‌లంటుకుని స్వ‌ల్ప‌ గాయాల‌య్యాయి. దీంతో పోలీసులు రంగ ప్ర‌వేశం చేసి ఏఐఈటీయూసీ ప్ర‌తినిధుల‌ను అరెస్ట్ చేసి నారాయ‌ణ్ గూడ , బేగంబ‌జార్ పోలీస్ స్టేష‌న్ల‌కు త‌ర‌లించారు . తెలంగాణ రాష్ట్ర ట్రాన్స్ పోర్టు వర్కర్స్ ఫెడరేషన్ (ఏఐటీయూసీ) ఆధ్వర్యంలో ప్ర‌తి రోజు పెంచుతున్న పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ ట్రాన్స్ పోర్టు వర్కర్స్ కేంద్ర ప్రభుత్వ దిష్టి బొమ్మను దగ్ధం చేస్తుండగా పోలీసులు అడ్డుకొని లాక్కునే ప్రయత్నం చేశారు. ఈ సంద‌ర్భంగా మంటలు చెలరేగి ఇద్దరు ఆటో డ్రైవర్లు నరసింహ, జమీల్ లపై పడడంతో వారికి స్వల్ప గాయాలయ్యాయి.

ఈ సందర్బంగా తీవ్ర ఉద్రిక్తతలు నెలకొని ఏఐటీయూసీ నేతలు పోలీసుల మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాటలు జరిగాయి, కొందరు రోడ్డు పై బైఠాయించి పోలీసులకు వ్యతరేకంగా నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. పోలీసులు వారిని అడ్డుకొని బలవంతంగా అరెస్ట్ చేసారు. కేంద్ర ప్రభుత్వం నిరంతరంగా పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను విపరీతంగా పెంచి ప్రజలపై మోయలేని భారాలు వేస్తే పతనం తప్పదని ఏఐటీయూసీ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.ఎస్.బోస్ హెచ్చరించారు. నిర‌స‌న సంద‌ర్భంగా ఇంధన ధరల పెరుగుదల కింద నలిగిపోతున్న పేద ప్రజలకు మోడీ సమాధానం చెప్పక తప్పదని అన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఇంధనాల ధరలు రోజురోజుకూ పెంచి ప్రజలను ఇక్కట్లకు గురి చేస్తూ ఆర్థిక దోపిడీకి పాల్పడుతుందని అయన ఆరోపించారు. బీజేపీ ప్రభుత్వం ప్రజల ప్రయోజనాలకోసం కాకుండా స్వదేశీ, విదేశీ కార్పొరేట్ల ప్రయోజనాలకోసం పనిచేస్తున్నాయని అందుకే సంస్కరణల పేరుతో దేశప్రజలపై మరిన్ని భారాలు వేస్తున్నాయని అయన మండిపడ్డారు.

ఆర్థిక అసమానతలు కారణంగా విస్తారమైన ప్రజల కొనుగోలు శక్తిని దెబ్బతీశాయని, ఎన్నడూలేనివిధంగా ఇంధనం ధరలు పైపైకి ఎగురుతుంటే ప్రజలు ఎలా బ్రతకాలని అయన ప్రశ్నించారు. డీజిల్, పెట్రోల్ ధరల పెరుగుదల వల్ల అన్ని నిత్యావసరాల వస్తువుల, కూరగాయల ఇరవై శతం రేట్లు పెరిగాయని అయన తెలిపారు. రోజురోజుకు పెంచుతున్న పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను వెంటనే నియంత్రించి, పెంచిన ధరలను తక్షణమే తగ్గించాలని లేకుంటే తగ్గించే వరకు పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహిస్తామని వి.ఎస్.బోస్ తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ట్రాన్స్ పోర్టు వర్కర్స్ ఫెడరేషన్ బి. వెంకటేశం మాట్లాడుతూ నిరంతరం పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల పెంపుదలతో సామాన్యుడిపై భారం విపరీతంగా పడుతుందని, ముఖ్యంగా రవాణా కార్మికుల నడ్డి విరుగుతోందని ఆవేదన వ్యక్తం చేసారు. ఇప్పటికి కొనసాగుతున్న కరోనా విపత్కర పరిస్థితుల్లో దేశంలోని రవాణా కార్మికులు ఇప్పటివరకు కూడా ఉపాధి, ఆదాయం లేకుండా అల్లాడుతుంటే ఊరటనివ్వాల్సిన కేంద్ర ప్రభుత్వం ఇంధన ధరలు పెంచడం దారుణం అని అన్నారు. తక్షణమే పెంచిన ఇంధన ధరలు తగ్గించి, పెట్రోల్, డీజిల్, గ్యాస్ లను జీఎస్టీ పరిధిలోకి తీసుకరావాలని ఆయ‌న కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు. ఈ కార్యక్రమంలో ఆటో రిక్షా డ్రైవర్స్ యూనియన్ హైదరాబాద్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి ఏ. బిక్షపతి యాదవ్, ఆర్. మల్లేష్. నేతలు ఒమర్ ఖాన్, సిహెచ్ జంగయ్య, ఫరూక్, లతీఫ్ తదితరులు పాల్గొన్నారు

Next Story