నా తండ్రి తర్వాత అతనే : పతిరన ఆసక్తికర కామెంట్స్

by Dishanational3 |
నా తండ్రి తర్వాత అతనే : పతిరన ఆసక్తికర కామెంట్స్
X

దిశ, స్పోర్ట్స్ : చెన్నయ్ సూపర్ కింగ్స్ బౌలర్ మతీశా పతిరన 2022లో ఐపీఎల్‌లో సీఎస్కే తరపున అరంగేట్రం చేశాడు. ధోనీ మద్దతుతో రాటుదేలిన అతను ఈ సీజన్‌లోనూ తన బౌలింగ్‌తో అదరగొడుతున్నాడు. తాజాగా సీఎస్కే నిర్వహించిన లయన్స్ అప్‌క్లోజ్ షోలో పతిరన పాల్గొన్నాడు. ఈ వీడియోను శనివారం యూట్యూబ్‌లో రిలీజ్ చేశారు. ఈ షోలో ధోనీపై పతిరన ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. క్రికెట్ జీవితంలో ధోనీ తన తండ్రి పాత్రను పోషిస్తున్నాడని చెప్పాడు.

‘నా క్రికెట్ జీవితంలో నా తండ్రి తర్వాత ఆ రోల్‌ను పోషించేది ధోనీనే. ఇంట్లో ఉన్నప్పుడు మా నాన్న ఎలా అయితే ఉంటారో ధోనీ నాతో అలాగే ఉంటాడు. నాపై ఎల్లప్పుడు శ్రద్ధ చూపిస్తూ.. విలువైన సలహాలు ఇస్తాడు. అతను చెప్పే విషయాలు చిన్నవే అయినా నాపై ప్రభావం చూపుతాయి. ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి. ఆటను ఆస్వాదించాలని, శరీరాన్ని కాపాడుకోవాలని ధోనీ ప్రతిసారి చెబుతాడు.’ అని పతిరన తెలిపాడు.

మైదానం బయట తాము ఎక్కువగా మాట్లాడుకోకపోయినా, ఏదైనా అడగాలని అనిపిస్తే వెంటనే అతన్ని అడిగుతానని చెప్పాడు. ఈ సందర్భంగా ధోనీ మరో సీజన్ ఆడాలని పతిరన కోరాడు. ‘మహీ భాయ్ మీరు మరో సీజన్ ఆడాలి. ప్లీజ్ మాతో ఆడండి.’ అని అభ్యర్థించాడు. కాగా, ప్రస్తుత సీజన్‌లో పతిరన 6 మ్యాచ్‌ల్లో 13 వికెట్లు తీశాడు. ముస్తాఫిజుర్ రెహ్మాన్(14) తర్వాత సీఎస్కే తరపున రెండో హయ్యెస్ట్ వికెట్ టేకర్‌గా కొనసాగుతున్నాడు.

Next Story