బెల్ట్ షాపు వద్ద వ్యక్తి అనుమానాస్పద మృతి

by Jakkula Mamatha |
బెల్ట్ షాపు వద్ద వ్యక్తి అనుమానాస్పద మృతి
X

దిశ, కడప:ప్రముఖ పుణ్యక్షేత్రమైన బ్రహ్మంగారిమఠంలో ఒక బెల్ట్ షాప్ వద్ద సోమిరెడ్డిపల్లె సింహ రాయలు అనే వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. చిన్న చిన్న పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న తన స్వగ్రామమైన బ్రహ్మంగారి మఠానికి సమీపంలోని మద్ది రెడ్డి పల్లె నుంచి రోజువారిలాగనే గురువారం మఠానికి వచ్చారు. రాత్రి తిరిగి ఇంటికి వెళ్లని ఆయన శుక్రవారం తెల్లారేసరికి బెల్ట్ షాప్ వద్ద మృతి చెంది కనిపించాడు. ఈ విషయం తెలుసుకున్న బంధువులు, భార్య తీవ్రంగా రోదిస్తూ అక్కడికి చేరుకొని ఆందోళన వ్యక్తం చేశారు. తన భర్తను హత్య చేశారని పేర్కొంటూ నలుగురిపై ఫిర్యాదు చేశారు. అనుమానాస్పదంగా మృతి చెందిన సింహరాయలుకు మద్యం తాగించి తర్వాత హత్యకు పాల్పడి ఉంటారని ఆమె ఫిర్యాదు చేశారు. మృతుడి భార్య విజయమ్మ ఇచ్చిన ఫిర్యాదుతో నలుగురిపై అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని బద్వేలు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఆయన మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

*పుణ్యక్షేత్రమైన యదేచ్చగా మద్యం విక్రయాలు..

దక్షిణాది రాష్ట్రాల్లో ఒక పుణ్యక్షేత్రంగా గుర్తింపు ఉండి పలు ప్రాంతాల నుంచి యాత్రికులు నిత్యం పెద్ద ఎత్తున వచ్చే బ్రహ్మంగారి మఠంలో రకరకాల మద్యం విక్రయాలు, కల్తీ మద్యం విక్రయాలు జోరుగా సాగుతున్నట్లు మొదటి నుంచి ఆరోపణలు వస్తూనే ఉన్నాయి. గుడి బడి ముందు మద్యం షాపులు పెట్టకూడదన్న నిబంధనలు ఉన్నాయి. అందునా బ్రహ్మం గారి మఠం ప్రముఖ పుణ్యక్షేత్రం కావడంతో ప్రభుత్వ మద్యం షాపు కూడా ఆరు ఏడు కిలోమీటర్ల దూరంలో ఉంది. కానీ పుణ్యక్షేత్రం సెంటర్లో మాత్రం బెల్ట్ షాపు ఏర్పాటు చేసి నిత్యం మద్యం విక్రయిస్తుండడం మఠం పవిత్రతకు భంగం చేకూర్చడమే కాకుండా స్థానికులకు, యాత్రికులకు కూడా అసౌకర్యంగా మారింది. కొన్ని రకాల మద్యం బయట నుంచి తెచ్చి ఎక్కువ రేట్లకు విక్రయిస్తుండగా , వీటితో పాటు కల్తీ మద్యం కూడా విక్రయిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. పుణ్యక్షేత్రమైన మఠంలో బెల్ట్ షాపులు, వీటితో పాటు కొందరు బయట నుంచి మద్యం తీసుకొచ్చి విక్రయిస్తూ ఉండటంతో స్థానికులు, యాత్రికుల్లో ఆందోళన వ్యక్తం అవుతోంది. జిల్లా ఎక్సైజ్ అధికారులు, జిల్లా పోలీసులు అధికారులు పుణ్యక్షేత్రంలో మద్యం విక్రయాలపై దృష్టి సారించాలని స్థానికులు కోరుకుంటున్నారు. అంతేకాదు బ్రహ్మంగారిమఠంలో ఇలాంటి అపవిత్ర కార్యక్రమాలకు తావు లేకుండా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Next Story

Most Viewed