ఆర్టీసీ బస్సులో రూ. 44 లక్షలు సీజ్​

by Disha Web Desk 15 |
ఆర్టీసీ బస్సులో రూ. 44 లక్షలు సీజ్​
X

దిశ, ఖమ్మం రూరల్ : ఖమ్మం రూరల్‌ పరిధిలో వేర్వేరు చోట్ల కలిసి 44 లక్షలకు పైగా నగదు సీజ్​ చేశారు. స్థానిక వెంకటగిరి క్రాస్ రోడ్‌ వద్ద పోలీసులు నిర్వహిస్తున్న వాహనాల తనిఖీలో ఎలాంటి పత్రాలు , బిల్లులు లేకుండా ఆర్టీసీ బస్సులో తరలిస్తున్న 42 లక్షల 86 వేల 290 రూపాయలు సీజ్ చేసి ఆదాయపు పన్ను శాఖ అధికారులకు సమాచారం ఇచ్చినట్లు పోలీస్ కమిషనర్ సునీల్ దత్ తెలిపారు. లోక్​సభ సాధారణ ఎన్నికల నేపథ్యంలో కమిషనరేట్ పరిధిలో తనిఖీలు ముమ్మరం చేసినట్టు తెలిపారు. అందులో భాగంగా శనివారం వెంకటగిరి క్రాస్ రోడ్‌ వద్ద సీఐ అంజలి తమ సిబ్బందితో నిర్వహిస్తున్న తనిఖీలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతానగర్ మండలానికి చెందిన ఓ వ్యక్తి మిర్యాలగూడ నుండి మణుగూరు వెళ్తున్న ఆర్టీసీ ఎక్స్‌ప్రెస్ బస్సులో ఎన్నికల నియమావళి విరుద్ధంగా బిల్లులు లేకుండా నగదుతో ప్రయాణిస్తుండగా గుర్తించి నగదు సీజ్ చేశారు.

అదేవిధంగా కల్లూరులోని పెరువంచ అంతరాష్ట్ర సరిహద్దు చెక్‌పోస్టు వద్ద మోహరించిన పోలీసులు, ఎస్ ఎస్ టీ బృందంతో నిర్వహిస్తున్న తనిఖీలలో ఓ వ్యక్తి ఎలాంటి రశీదులు లేకుండా తిరువూరు మండలం మునుకుళ్ల గ్రామం నుండి ఖమ్మం రూరల్ పెద్దతండా తీసుకెళ్తన్న రూ.1,65,000 నగదు సీజ్ చేసినట్లు తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా సరైన ఆధారాలు చూపించకుండా తరలించే నగదు, నగలు, ఇతరత్రా సొత్తును సీజ్‌ చేసి సంబంధిత అధికారులకు అప్పగిస్తారని తెలిపారు. ఎన్నికల నిబంధనల మేరకు రూ. 50 వేలకు మించి నగదు తీసుకువెళ్లరాదని, పెద్ద మొత్తంలో నగదు, ఆభరణాలు ఉంటే తప్పనిసరిగా వెంట సంబంధిత పత్రాలు ఉండాలని సూచించారు.



Next Story

Most Viewed