బురహాన్ పల్లి మాజీ సర్పంచ్ దారుణ హత్య

by Aamani |
బురహాన్ పల్లి మాజీ సర్పంచ్ దారుణ హత్య
X

దిశ,రాయపర్తి : మండలంలోని బురహాన్ పల్లి గ్రామానికి చెందిన తాజా మాజీ సర్పంచ్ సూదుల దేవేందర్ (55) గుర్తు తెలియని వ్యక్తుల చేతిలో ఆదివారం రాత్రి దారుణంగా హత్య చేయబడ్డారు. మృతుని హత్యకు పాతకక్షలే కారణం కావచ్చు అని పలువురు అనుమానిస్తున్నారు. గతంలో భూమి తగాదాలో గొడవలు బాగా జరిగేవి అని, ఆ గొడవలే ఈ హత్యకు దారితీయవచ్చని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దేవేందర్ రోజు లాగానే ఆదివారం రాత్రి వరకు తన ఇంటి ముందు కనిపించాడని తన ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ఒంటరిగా దేవేందర్ ను మాటు వేసి పథకం ప్రకారమే బలమైన ఆయుధంతో తలపై కొట్టి దారుణంగా హత్య చేసి ఉంటారని భావిస్తున్నారు.

ఉలిక్కిపడ్డ బురహాన్ పల్లి..

తాజా మాజీ సర్పంచ్ దేవేందర్ తన ఇంట్లోనే దారుణంగా హత్యకు గురికావడంతో గ్రామం ఒక్కసారిగా ఉలిక్కి పడి గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. రోజు కనిపించి మాట్లాడే మాజీ సర్పంచ్ దేవేందర్ హత్యకు గురై రక్తపు మడుగులో పడి విగత జీవిగా ఉండడం చూసి గ్రామస్తులు భయంతో హడలెత్తి పోయారు.

సంఘటన స్థలాన్ని పరిశీలించిన వెస్ట్ జోన్ డీసీపీ రాజమహేంద్ర నాయక్

బురహాన్ పల్లి గ్రామానికి చెందిన తాజా మాజీ సర్పంచ్ సూదుల దేవేందర్ తన ఇంట్లోనే హత్యకు గురి కావడంతో సమాచారం అందుకున్న జనగాం వెస్ట్ జోన్ డిసిపి రాజమహేంద్ర నాయక్ సీఐ సూర్యప్రకాశ్ ఎస్సై సందీపులు సోమవారం ఉదయం సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. డాగ్స్ కార్డ్స్ క్లూస్ టీం లతో పరిశీలించారు. అనంతరం మృతుని కుమారుడు నిఖిల్ ఫిర్యాదు మేరకు శవ పంచనామా నిర్వహించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఈ సందర్భంగా డీసీపీ రాజమహేంద్ర నాయక్ మాట్లాడుతూ గ్రామస్తులు ఎవరు భయాందోళనకు గురి కావద్దని హత్యకు కారణమైన వారిని త్వరలోనే గుర్తించి నిందితులను పట్టుకుని చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు గ్రామాలలో హత్య జరగడం బాధాకరం అన్నారు. నిందితులు ఎంతటి వారైనా శిక్ష పడక తప్పదు అన్నారు.

Advertisement

Next Story