ఆస్తి కోసం పక్కా ప్లాన్​

by Sridhar Babu |
ఆస్తి కోసం పక్కా ప్లాన్​
X

దిశ,షాద్ నగర్ : ఆస్తి కోసం సొంత అన్నను తమ్ముడు చంపిన ఘటన రంగారెడ్డి జిల్లా ఫరూఖ్ నగర్ మండలంలోని దూసకల్ గ్రామంలో చోటు చేసుకుంది. షాద్ నగర్ సీఐ విజయ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం దూసకల్ గ్రామానికి చెందిన కేశమోని క్రిష్ణయ్య (52),కేశమోని చంద్రయ్య (49) ఇద్దరూ అన్నాదమ్ములు. అన్న కృష్ణయ్య కు పిల్లలు లేరు. అలాగే ఈయన భార్య కళమ్మ అలియాస్ కళావతి అనారోగ్యంతో రెండు సంవత్సరాల క్రితం మృతి చెందింది. ఇదే అదునుగా భావించిన తమ్ముడు కేశమోని చంద్రయ్య తన అన్న కృష్ణయ్యకు నమ్మకంగా ఉంటూ పొలం పనులు చేసేవాడు. తన అన్నను చంపితే ఆస్తి సొంతం చేసుకోవచ్చని పన్నాగం పన్నాడు. ఈనెల 7వ తేదీన సాయంత్రం మద్యం కొని తన అన్న కృష్ణయ్య ఇంటి వద్దకు తీసుకెళ్లి ఇద్దరూ కలిసి తాగారు.

తన అన్నకు ఎక్కువ మద్యం తాగించి అనంతరం బైక్ పై తీసుకెళ్లి ఊరి బయట ఉన్న చెరువులో పడేసి చంపాడు. అనంతరం తన అన్న ఇంట్లో ఉన్న 3 తులాల బంగారం, రెండు పట్టాదార్ పాస్ బుక్ లు, 31 వేల 500 రూపాయల నగదు, ఖాళీ బాండ్ పేపర్లను దొంగిలించాడు. తన అల్లుడు కనిపించడం లేదని కృష్ణయ్య అత్త బాలమణి ఇచ్చిన ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న షాద్ నగర్ పోలీసులు మృతుడి కుటుంబ సభ్యులను విచారించగా తన అన్నను తానే చంపానని చంద్రయ్య ఒప్పుకున్నాడు. ఈ నెల 11వ తేదీన కృష్ణయ్య శవం చెరువులో పైకి తేలిందని తెలిపారు. శుక్రవారం నిందితుడు చంద్రయ్య నుండి బంగారం, నగదు, పాస్ బుక్ లు రికవరీ చేసి కోర్టులో హాజరు పరిచారు. ఈ సమావేశంలో ఎస్సై బలరాం తదితరులు ఉన్నారు.

Advertisement

Next Story

Most Viewed