ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టిన లారీ.. విద్యార్థి దుర్మరణం

by Aamani |
ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టిన లారీ.. విద్యార్థి దుర్మరణం
X

దిశ,తాండూరు : ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీకొన్న ఘటన కరన్ కోట్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఈ ప్రమాదంలో ఓ విద్యార్థి అక్కడికక్కడే దుర్మరణం పాలైన ఘటన శనివారం ఉదయం కరన్ కోట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. స్థానికులు, ఎస్సై విట్టల్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. జీవన ఉపాధి కోసం మదం హనుమంతు, వరలక్ష్మిలు కుటుంబ సమేతంగా తాండూరు మండలానికి వలస వచ్చారు. అయితే వీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనంతపూర్ జిల్లా గుత్తి మండలం అనగాని దొడ్డి గ్రామానికి చెందినవారు. తాండూరు మండలం గోపన్ పల్లి సమీపంలో ఉన్న నజీర్ సేట్ అనే నాపరాతి బండరాళ్ల వ్యాపారి పాలిషింగ్ యూనిట్లో పనిచేస్తూ జీవనం కొనసాగిస్తున్నారు.

శనివారం ఉదయం హన్మంతు తన కూతురు, కొడుకు జనార్దన్( 08)ను తాండూరు పట్టణంలో ఉన్న విజయ విద్యాలయ స్కూల్ కి ద్విచక్ర వాహనంపై బయలుదేరారు. గౌతాపూర్ గ్రామం సమీపంలోకి రాగానే వెనక నుంచి వస్తున్న లారీ వీరి ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. దీంతో కిందపడిన జనార్ధన్ తలభాగం నుజ్జు నుజ్జు కావడంతో విద్యార్థి అక్కడికక్కడే మృతి చెందాడు. క్షణాల్లో కళ్లముందే బాలుడు మరణించడంతో తల్లిదండ్రులు కన్నీటి శోకాలు పెట్టారు. విషయం తెలుసుకున్న కరన్ కోట్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కోసం తాండూరులోని జిల్లా ఆస్పత్రికి తరలించారు. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై విఠల్ రెడ్డి తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed