విదేశాల నుండి సైబర్ మోసాలు చేపిస్తున్న ముఠా అరెస్టు

by Disha Web Desk 15 |
విదేశాల నుండి సైబర్ మోసాలు చేపిస్తున్న ముఠా అరెస్టు
X

దిశ, రాజన్న సిరిసిల్ల ప్రతినిధి : కంబోడియా దేశంలో చైనీస్ సంబంధించిన కంపెనీలో సైబర్ మోసాలు చేపిస్తున్న ముఠాను సిరిసిల్ల పోలీసులు పట్టుకున్నట్లు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. ఈమేరకు జిల్లా పోలీసు కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో కేసుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. జిల్లా పోలీస్ కార్యాలయానికి సిరిసిల్ల పట్టణం పెద్దూర్ గ్రామానికి చెందిన అతికం లక్ష్మీ అనే మహిళ తన కొడుకు శివ ప్రసాద్ జగిత్యాల జిల్లా కోడిమ్యాల గ్రామానికి చెందిన కంచర్ల సాయి ప్రసాద్ అనే ఏజెంట్ కి లక్ష 40 వేల రూపాయలు ఇచ్చి కాంబోడియా దేశానికి వెళ్లి మోసపోయాడు అని ఫిర్యాదు చేసింది. దాంతో పోలీసులు శివ ప్రసాద్ మొబైల్ నెంబర్ తీసుకొని వాట్సప్ ద్వారా మాట్లాడగా చైనీస్ కి చెందిన కంపెనీలో శివ ప్రసాద్ పాస్ పోస్ట్ తీసుకొని సైబర్ నేరాలు చేపిస్తున్నారని, తనతో పాటు దేశానికి చెందిన 500 నుంచి 600 మంది బాధితులు ఉన్నారని చెప్పాడు. అందరితో కాల్ సెంటర్ లాగా ఏర్పాటు చేసి ఇండియన్ ఫోన్ నంబర్స్ ఇచ్చి లాటరీ, జాబ్, టాస్క్ ల పేరుతో మోసాలు చేస్తున్నారని బాధితుడు తెలిపాడు.

ఈ టాస్క్ లు చేస్తే అధికమొత్తంలో డబ్బులు వస్తాయని సైబర్ మోసాలు చేపిస్తున్నారనిపేర్కొన్నాడు. ఈ నేపథ్యంలో సిరిసిల్ల పట్టణ పోలీస్ స్టేషన్ కేసు నమోదు చేసి కంబోడియాలో ఉన్న ఇండియన్ ఎంబాసి అధికారులతో మాట్లాడి బాధితుని వివరాలు పంపగా అక్కడి లోకల్ పోలీసుల సహాయంతో శివ ప్రసాద్ ను కాపాడారు. శివ ప్రసాద్ రెండు రోజుల లోపు ఇండియాకు చేరుకుంటారని, అదేవిధంగా బాధితులని కాపాడి ఇండియాకి పంపించనున్నారు. నిందితుడు జగిత్యాల జిల్లాకు చెందిన కంచర్ల సాయి ప్రసాద్ పై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకొని విచారించగా 10 వేల రూపాయలు కమిషన్ తీసుకొని లక్నో కి చెందిన సదాకత్ అనే వ్యక్తి కి పంపగా ప్రస్తుతం మాళ్దివీస్లో ఉంటున్న అతను పూణేలో ఉన్న అబిద్ ఆన్సరీ కి పైకం పంపగా వీరి వెనుక ఉన్న బీహార్ రాష్టానికి చెందిన ప్రస్తుతం దుబాయ్ లో ఉంటున్న షాదబ్ అనే వ్యక్తికి డబ్బులు పంపుతాడని తెలిపారు. దాంతో షాదబ్ యువకులను కంబోడియా దేశానికి పంపుతాడని తెలిపారు.

వీరిలో జగిత్యాల జిల్లాకు చెందిన కంచర్ల సాయి ప్రసాద్ ని ,పూణే లో ఉన్న అబిద్ ఆన్సరీ ని అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు తెలిపారు. మిగతా ఇద్దరిని త్వరలో పట్టుకుంటామన్నారు. సైబర్ సెక్యూరిటీ సహాయంతో ఈ కేసును ఛేదించినట్లు ఎస్పీ తెలిపారు. ఉద్యోగ, ఉపాధి నిమిత్తం గల్ఫ్ దేశాలకు వెళ్లే యువకులు లైసెన్స్ కలిగి ఉన్న ఏజెన్సీలను మాత్రమే ఆశ్రయించాలని ఆయన కోరారు. జిల్లాలో ఎవరైతే ఏజెన్సీల లేదా ఏజెంట్ల చేతిలో మోసపోయారో వారి కోసం ఏర్పాటు చేసిన స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ అధికారి ఫోన్ నెంబర్ 8712656411 కి నేరుగా ఫోన్ కాల్ ద్వారా ఫిర్యాదు చేస్తే ఆ ఫిర్యాదుపై తగిన రీతిలో విచారణ జరిపి నేరం రుజువు అయితే సదరు వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ సమావేశంలో డీఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి, సీఐ రఘుపతి, టాస్క్ఫోర్స్ సీఐ ప్రవీణ్ కుమార్ పాల్గొన్నారు.



Next Story

Most Viewed