రామాలయం పై ఎగరేసే జెండా మీద ముద్రించిన చెట్టు ప్రాముఖ్యత ఏమిటి..

by Sumithra |
రామాలయం పై ఎగరేసే జెండా మీద ముద్రించిన చెట్టు ప్రాముఖ్యత ఏమిటి..
X

దిశ, ఫీచర్స్ : జనవరి 22న అయోధ్యలో నూతనంగా నిర్మించిన రామాలయంలో రాంలాలా విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం జరగనుండటంతో దేశ వ్యాప్తంగా ఉత్కంఠ వాతావరణం నెలకొంది. కాగా, రామాలయం పై ఎగురవేయాల్సిన జెండా డిజైన్‌ను మార్చినట్లు సమాచారం. రామ మందిరం పై ఎగరేసే జెండా పై సూర్యుడు, కోవిదర్ చెట్టు చిహ్నం ముద్రించారు. శ్రీరామ మందిరంలో రామ్ లల్లా ప్రతిష్ఠాపన కార్యక్రమానికి మధ్యప్రదేశ్‌లోని రేవా నుంచి 100 జెండాలను తరలిస్తున్నారు. రేవా లోని హర్దువా గ్రామానికి చెందిన లలిత్ మిశ్రా వీటిని సిద్ధం చేశారు.

ఇటీవల, రామ జన్మభూమి తీర్థం ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్‌కి లలిత్ మిశ్రా రామాలయం జెండా నమూనాను అందించారు. ఐదుగురు సభ్యుల కమిటీ కొన్ని మార్పులు చేయాలని సూచించింది. ఇప్పుడు కొత్త డిజైన్‌ను కమిటీ ముందు పెట్టనున్నారు. దీని తర్వాత జెండా పొడవు, వెడల్పు నిర్ణయించనున్నారని తెలిపారు. రామ మందిరం శిఖరం పై అలంకరించిన ఈ జెండా చాలా ప్రత్యేకమైనదని పండితులు చెబుతున్నారు.

సూర్యవంశ చిహ్నం సూర్యుడని, అందుకే ఈ జెండా పై సూర్యుని చిహ్నం ముద్రించారని లలిత్ మిశ్రా చెప్పారు. కోవిదర్ చెట్టు అయోధ్య రాజ వృక్షం. భారతదేశంలో ప్రస్తుతం మర్రి చెట్టును జాతీయ వృక్షంగా పిలుస్తున్నట్లుగా, ఆ సమయంలో కోవిదర్ చెట్టును రాజ వృక్షంగా పరిగణించేవారు. కొన్ని ప్రదేశాలలో కోవిదర్ చెట్టును కచ్నార్ చెట్టు అని కూడా పిలుస్తారు.

పురాణాలలో కోవిదర్ చెట్టు ప్రస్తావన..

కాలక్రమేణా కోవిదర్ చెట్ల సంఖ్య గణనీయంగా తగ్గింది. పురాణాల ప్రకారం కశ్యప ఋషి ఈ చెట్టును సృష్టించాడని చెబుతారు. ఈ చెట్టు ప్రస్తావన హరివంశ పురాణంలో కూడా ఉంది.

వాల్మీకి రామాయణంలో కూడా ఈ చెట్టును గురించి ప్రస్తావించారు. ఈ చెట్టులో అనేక ఔషధ గుణాలు ఉన్నాయని పురాణాలు చెబుతున్నాయి. రామాయణం ప్రకారం శ్రీరాముడిని అయోధ్యకు తిరిగి రమ్మని అభ్యర్థించడానికి భరతుడు చిత్రకూట్‌కు వెళ్లినప్పుడు, అతని రథం పై ఉన్న జెండా పై కోవిదర్ చెట్టు ఉందని పురాణాలు చెబుతున్నాయి. దూరం నుండి ఆ జెండాను చూసిన లక్ష్మణుడు అది అయోధ్య సైన్యం అని గుర్తించారని చెబుతున్నారు.

Next Story

Most Viewed