పెళ్లి సందడి.. నిండా ముంచిన హైదరాబాద్ అతిథులు

by vinod kumar |
పెళ్లి సందడి.. నిండా ముంచిన హైదరాబాద్ అతిథులు
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : రాష్ట్రంలో కరోనా కేసులు మళ్లీ తారా స్థాయికి చేరుకుంటున్నాయి. నిజామాబాద్ జిల్లా వర్ని మండలం సిద్ధాపూర్ తండాలో అదివారం వరకు 86 పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి. తండాలో గత మూడ్రోజులుగా వైద్య ఆరోగ్య శాఖ వారు క్యాంపును ఏర్పాటు చేసి పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఏప్రిల్ 2వ తేదీన 26 మందికి పరీక్షలు జరపగా అందులో 17 మందికి పాజిటివ్ వచ్చింది. ఆదివారం 370 మందికి పరీక్షలు చేయగా 43 మందికి పాజిటివ్ నిర్ధారణ అయ్యింది.

1600 పైచిలుకు జనాభా ఉన్న సిద్ధాపూర్ తండాలో గత నెల 31న ఒక వివాహం జరిగింది. దానికి హైదరాబాద్‌లో ఉన్నత విద్యను అభ్యసిస్తున్న కొందరు యువకులు హజరయ్యారు. అదే వేడుకకు మహరాష్ర్టకు చెందిన వారు కూడా హాజరయ్యారు. పెళ్లి అనంతరం ఈనెల 1వ తేదీన కొందరు కరోనా లక్షణాలతో హన్మాజీపేట్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పరీక్షలు చేయించుకోగా హైదరాబాద్ నుంచి వచ్చిన ముగ్గురికి పాజిటివ్ తేలింది. వారు పెళ్లిలో సంచరించడంతో గ్రామంలో వైద్య ఆరోగ్య శాఖ క్యాంప్‌ను ఏర్పాటు చేసి ర్యాపిడ్ యాంటి జెన్ పరీక్షలు జరుపుతున్నారు. పాజిటివ్ వచ్చిన వారిని హోం క్వారంటైన్‌లో ఉంచి పరీక్షలు చేస్తున్నట్లు వైద్యారోగ్య శాఖాధికారి సుదర్శనం తెలిపారు. ఆ తర్వాత గ్రామం అంతటా శానిటైజేషన్ చేయించినట్లు గ్రామ అధికారులు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed