ప్రైవేటు సైన్యంతో రష్యా ప్రభుత్వం రాజీ..

by Vinod kumar |
ప్రైవేటు సైన్యంతో రష్యా ప్రభుత్వం రాజీ..
X

మాస్కో (రష్యా) : తిరుగుబాటు చేసిన కిరాయి సైన్యం "వాగ్నెర్ గ్రూప్" ఎట్టకేలకు రష్యా సర్కారుతో రాజీకి వచ్చింది. ఇప్పటికే స్వాధీనం చేసుకున్న రోస్టోవ్ నగరాన్ని వదిలి.. ఉక్రెయిన్ బార్డర్ లోని దాని బేస్‌కు తిరిగి వెళ్లేందుకు అంగీకరించింది. ఈమేరకు రష్యా తరఫున రాయబారం నడిపిన బెలారస్ అధ్యక్షుడు అలెగ్జాండర్ లుకషెంకో, వాగ్నెర్ గ్రూప్ చీఫ్ యెవ్జెనీ ప్రిగోజిన్ మధ్య రాజీ ఒప్పందం కుదిరింది. ఒక ఆడియో సందేశం విడుదల చేసిన యెవ్జెనీ ప్రిగోజిన్ .. “రష్యాలో రక్తపాతం జరిగే ముప్పు ఉన్నందున మా ఫైటర్లు తిరిగి మా స్థావరానికి వచ్చేస్తారు” అని ప్రకటించాడు. తిరుగుబాటుదారుల భద్రతకు రష్యా నుంచి బెలారస్ అధ్యక్షుడు హామీ ఇప్పించినందుకు ప్రతిఫలంగానే ఈ నిర్ణయం తీసుకున్నానని యెవ్జెనీ ప్రిగోజిన్ వెల్లడించాడు.

ఈ డీల్ లో భాగంగా యెవ్జెనీ ప్రిగోజిన్ పై ఉన్న అన్ని నేరారోపణలను రద్దు చేసి.. దేశం విడిచి బెలారస్‌కు వెళ్లిపోయేందుకు సహకరిస్తామని రష్యా అంగీకరించింది. దీంతో కిరాయి సైన్యం వాగ్నెర్ గ్రూప్ , రష్యా ఆర్మీ మధ్య యుద్ధ మేఘాలు తాత్కాలికంగా తొలగిపోయాయి. ఆదివారం సాయంత్రానికల్లా రోస్టోవ్ నగరాన్ని యెవ్జెనీ ప్రిగోజిన్ కిరాయి సైన్యం ఖాళీ చేసి వెళ్లిపోయిందనే వార్తలు వచ్చాయి. రష్యాలో ఉద్రిక్తతల నేపథ్యంలో పుతిన్ సూచనతో రంగంలోకి దిగిన బెలారస్ అధ్యక్షుడు అలెగ్జాండర్ లుకషెంకో, వాగ్నెర్ గ్రూప్ చీఫ్ యెవ్జెనీ ప్రిగోజిన్ తో శనివారం రోజంతా చర్చలు జరిపి ఒక పరిష్కారాన్ని కనుగొనడంలో సక్సెస్ అయ్యారు. ఒకవేళ వాగ్నెర్ గ్రూప్, రష్యా ఆర్మీ తలపడి ఉంటే తీవ్ర రక్తపాతం సంభవించి, జన జీవనం స్తంభించి ఉండేది. రష్యాలోని రోస్టోవ్ నగరంలో ఉన్న సదరన్ మిలిటరీ డిస్ట్రిక్ట్ ప్రధాన కార్యాలయం నుంచే ఉక్రెయిన్ లోని రష్యా ఆర్మీకి ఆయుధాలు సప్లై అవుతుంటాయి. అందులో భారీగా ఆయుధాలు, మిస్సైళ్ళు, యుద్ధ ట్యాంకర్లు ఉన్నాయి.

Advertisement

Next Story

Most Viewed