Srilanka: పర్యాటకులకు శ్రీలంక గుడ్ న్యూస్.. భారత్ సహా 35 దేశాలకు వీసా రహిత ప్రవేశం

by vinod kumar |
Srilanka: పర్యాటకులకు శ్రీలంక గుడ్ న్యూస్.. భారత్ సహా 35 దేశాలకు వీసా రహిత ప్రవేశం
X

దిశ, నేషనల్ బ్యూరో: భారత్‌తో సహా 35 దేశాల పౌరులకు ఆరు నెలల పాటు వీసా రహిత ప్రవేశాన్ని కల్పిస్తు్న్నట్టు శ్రీలంక ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు ఆ దేశ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. అక్టోబర్ 1 నుంచి ఇది అమలులోకి రానున్నట్టు తెలుస్తోంది. ఎక్కువ మంది పర్యాటకులను ఆకర్షించాలనే లక్ష్యంతో ఈ విధానానికి తెరతీసినట్టు శ్రీలంక పర్యాటక మంత్రిత్వ శాఖ సలహాదారు హరిన్ ఫెర్నాండో తెలిపారు. శ్రీలంక జాబితా చేసిన దేశాల్లో చైనా, జర్మనీ ఆస్ట్రేలియా వంటి ప్రధాన దేశాలతో పాటు, సౌదీ అరేబియా, యూఏఈ, ఖతర్ వంటి పశ్చిమాసియా దేశాలు కూడా ఉన్నాయి. అంతేగాక జపాన్, ఫ్రాన్స్, కెనడా దేశాలకు కూడా అవకాశమిచ్చింది.

భారత్, చైనా, రష్యా, మలేషియా, జపాన్, ఇండోనేషియా, థాయ్‌లాండ్ నుంచి వచ్చే ప్రయాణికులకు ఉచిత వీసాలు అందించే పైలట్ ప్రాజెక్ట్‌ను గతేడాది అక్టోబర్‌లో శ్రీలంక ప్రవేశపెట్టింది. ఈ ప్రాజెక్ట్ గడువు మార్చి 2024లో ముగిసింది. ఇప్పుడు మరిన్ని దేశాలను ఇందులో భాగం చేసింది. శ్రీలంకలో ఆన్-అరైవల్ వీసాల కోసం పెరిగిన రుసుములను ఒక విదేశీ కంపెనీ నిర్వహిస్తుందనే వివాదం నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. కాగా, శ్రీలంకకు వచ్చే సందర్శకులలో 60 శాతం భారత్ నుంచే వెళ్లడం గమనార్హం.

Advertisement

Next Story