బంగ్లాదేశ్‌లో ఆగిన అల్లర్లు.. ఆ ఒక్క ప్రకటనతో మారిన సీన్

by Hajipasha |
బంగ్లాదేశ్‌లో ఆగిన అల్లర్లు.. ఆ ఒక్క ప్రకటనతో మారిన సీన్
X

దిశ, నేషనల్ బ్యూరో : ఎట్టకేలకు బంగ్లాదేశ్‌లో అల్లర్లు ఆగాయి. రాళ్లు రువ్వే ఘటనలు.. నిరసనకారుల నినాదాలు.. ఇరు వర్గాల ఘర్షణలతో దాదాపు రెండువారాలు అట్టుడికిన దేశ రాజధాని ఢాకా సోమవారం రోజు నిర్మానుష్యంగా కనిపించింది. నగరంలో నిరసనలేవీ జరగలేదు. స్వాతంత్య్ర సమరయోధుల కుటుంబాల వారికి ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లను తొలగించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించడంతో విద్యార్థి సంఘాలు శాంతించాయి. ఇంతకుముందు వరకు కర్ఫ్యూ ఆదేశాలను నిరసనకారులు ఉల్లంఘించారు.

అయితే సోమవారం ప్రతి ఒక్కరు ఆ రూల్స్‌ను ఫాలో అవుతూ కనిపించారు. ఒకటి, రెండురోజుల్లోగా దేశంలో మళ్లీ మునుపటిలా సాధారణ పరిస్థితులు వస్తాయని బంగ్లాదేశ్ హోం మంత్రి అసదుజ్జమా ఖాన్ ప్రకటించారు. దేశంలోని అన్ని ప్రాంతాల్లోనూ అల్లర్లు ఆగిపోయాయని తెలిపారు. అల్లర్ల నేపథ్యంలో అన్ని కార్యాలయాలు, సంస్థలకు సోమవారం వరకు సెలవులు ప్రకటించగా.. వాటిని తాజాగా మంగళవారం వరకు పొడిగించారు.



Next Story