వరంగల్‌ను ముంచెత్తిన వరద నీరు

by  |
వరంగల్‌ను ముంచెత్తిన వరద నీరు
X

దిశ ప్రతినిధి, వరంగల్: వరంగల్ నగరంలో ఎడతెరపి లేకుండా కురుస్తున్న వానలకు లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. ఖిలా వరంగల్ మండల పరిధిలో ఉన్న ఉర్సు, బీఆర్ నగర్ కాలనీలు జలమయం‌ అయ్యాయి. ఇళ్లలోకి నీరు చేరడంతో బాధితులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అప్రమత్తమైన అధికారులు వెయ్యి మందికి పైగా సురక్షిత స్థలాలకు తరలించారు. ఖిలా వరంగల్ తహశీల్దార్ కిరణ్ కుమార్, మిల్స్ కాలనీ సీఐ నరేష్ కుమార్, ఎస్సై భీమేష్ సిబ్బంది పరిస్థితులు పర్యవేక్షిస్తున్నారు.

వరంగల్ రెవెన్యూ పరిధిలోని ఎన్టీఆర్ నగర్ జలమయమైంది. అధికారులు వరదల్లో చిక్కుకున్న కుటుంబాలను నగరంలోని సంతోషిమాత గార్డెన్ కు తరలిస్తున్నారు. హన్మకొండ అంబేడ్కర్ నగర్ లో వరద ప్రభావిత ప్రాంతంలో ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్, జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, మేయర్ గుండా ప్రకాశ్ రావు, కుడా చైర్మెన్ మర్రి యాదవరెడ్డి తో కలిసి పర్యవేక్షిస్తున్నారు. కాకతీయ కాలనీ, వడ్డెర వీధిలో ముంపు ప్రాంతాల్లో పర్యటించిన అధికారులు వంద మందిని ఫంక్షన్ హాల్ కు తరలించాలని కలెక్టర్ రెవెన్యూ అధికారులకు ఆదేశాలు జారీ చేసారు.

మేడారాన్ని ముంచెత్తిన జంపన్న వాగు

ములుగు జిల్లాలో భారీ వర్షం కురుస్తోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో మేడారంలోని జంపన్న వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. చరిత్రలో మొట్టమొదటి సారిగా మేడారం గ్రామాన్ని వర్షపు నీరు చుట్టేసింది. ప్రస్తుతం మేడారం గద్దెల సమీపంలోని ఐటిడీఏ కార్యాలయాన్ని జంపన్న వాగు వరద నీరు తాకింది. చిలుకల గుట్టను‌ చేరిన వరదనీరు సమ్మక్క-సారలమ్మ గద్దెలవైపు ప్రవహిస్తుంది. పస్రా నుండి మేడారానికి రవాణా సౌకర్యాలు పూర్తిగా నిలిచిపోయాయి. జనజీవనం స్తంభించింది.


Next Story

Most Viewed