వైసీపీ ఎమ్మెల్యే‌ అంబేద్కర్‌‌పై దాడి చేశారు: వర్ల రామయ్య

by srinivas |   ( Updated:2021-08-21 06:24:22.0  )
వైసీపీ ఎమ్మెల్యే‌ అంబేద్కర్‌‌పై దాడి చేశారు: వర్ల రామయ్య
X

దిశ, ఏపీ బ్యూరో: వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్‌పై టీడీపీ నేతలు డీజీపీ గౌతం సవాంగ్‌కు ఫిర్యాదు చేశారు. భారత రాజ్యాంగంపై జోగి రమేష్‌ అనుచిత వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదు చేశారు. అనంతరం టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య మాట్లాడుతూ.. డా. బీఆర్ అంబేద్కర్ భారత రాజ్యాంగాన్ని షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల కోసం మాత్రమే రాశారని జోగి రమేష్‌ వ్యాఖ్యానించడాన్ని ఆయన ఖండించారు. ఇలాంటి ప్రకటన భారత రాజ్యాంగాన్ని తక్కువ చేయడమే కాకుండా.. డా. బీఆర్ అంబేద్కర్‌పై దాడి చేయడంలాంటిదేనన్నారు. అంతేకాదు షెడ్యూల్ కులాలను కించపరచడం, అవమానించినట్లేనని ఆరోపించారు. వర్గ విద్వేషాన్ని రెచ్చగొట్టే ఇలాంటి ప్రకటన.. చట్టంలోని నిర్దిష్ట సెక్షన్ల కింద శిక్షార్హమైనదని చెప్పుకొచ్చారు. భారత రాజ్యాంగం దేశంలోని ప్రతి పౌరుడికీ సంబంధించినదని దానిపై జోగి రమేష్‌ వ్యాఖ్యలు సరికాదన్నారు. డా. బీఆర్ అంబేద్కర్ అంతర్జాతీయ పండితుడిగా ప్రసిద్ధి చెందిన వ్యక్తి అని అలాంటి మహోన్నతమైన వ్యక్తికి.. భారత రాజ్యాంగానికి వర్గ తత్వాన్ని ఆపాదిస్తూ ఎమ్మెల్యే జోగి రమేష్‌ అహంకారపూరిత వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు. జోగి రమేష్‌పై నిబంధనల ప్రకారం వెంటనే కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని తాము కోరినట్లు వర్ల రామయ్య తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed