మళ్లీ నోరు జారిన ఉత్తరాఖండ్ సీఎం.. ఈసారి ఏమన్నారంటే…

by Anukaran |
uttarakhand cm tirath sing rawath
X

దిశ, వెబ్‌డెస్క్: ఇటీవలే మహిళలు ధరించే రిప్డ్ జీన్స్‌ (చినిగిన జీన్స్)పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచిన ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి తీరథ్ సింగ్ రావత్ మరోసారి నోరుజారారు. భారత్‌ను అమెరికా 200 ఏళ్ల పాటు పాలించిందని ఆయన వ్యాఖ్యానించారు. డెహ్రాడూన్‌లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

రావత్ మాట్లాడుతూ.. ‘భారత్‌ను 200 ఏళ్ల పాటు పాలించిన అమెరికా నేడు కరోనాతో విలవిల్లాడుతున్నది. వైద్యరంగంలో ప్రపంచంలోనే యూఎస్ నెంబర్ వన్ దేశంగా ఉన్నది. కానీ అక్కడ కరోనా బారిన పడి యాభై లక్షలకు పైగా ప్రజలు చనిపోయారు. ఇప్పటికీ వాళ్లు దానిని అదుపుచేయలేక మళ్లీ లాక్‌డౌన్ వైపునకు అడుగులు వేస్తున్నారు’ అని అన్నారు. ఈ క్లిష్ట సమయాల్లో మోడీ భారత ప్రధానిగా లేకుంటే పరిస్థితులు చాలా కఠినంగా ఉండేవని వ్యాఖ్యానించారు. కరోనా నుంచి దేశ ప్రజలను కాపాడటంతో మోడీ ఎంతో కృషి చేస్తున్నారని రావత్ తెలిపారు.

కాగా బ్రిటన్ అనాల్సిన చోట అమెరికా అనడంతో రావత్ వ్యాఖ్యలపై నెటిజన్లు ఓ ఆటాడుకుంటున్నారు. ‘అరే.. మా సిలబస్‌లో ఈ పాఠాలు ఎప్పుడూ చెప్పలేదే..?’ ‘ఇండియాను అమెరికా పాలించిందా..? ఇది నిజమా..?’ అంటూ కామెంట్లు చేస్తూ ట్రోల్ చేస్తున్నారు.

Next Story

Most Viewed