కరోనా వచ్చిందని కన్నీళ్లు పెట్టుకున్న క్రికెటర్

by Shyam |
కరోనా వచ్చిందని కన్నీళ్లు పెట్టుకున్న క్రికెటర్
X

దిశ, స్పోర్ట్స్: తనకు కరోనా సోకిందని తెలయగానే చాలా ఆందోళన చెందానని.. అసలు ఏం చేయాలో అర్థం కాలేదని న్యూజీలాండ్ క్రికెటర్ టిమ్ సీఫెర్ట్ అన్నాడు. ఐపీఎల్ 2021లో కోల్‌కతా నైట్‌రైడర్స్ తరపున ఆడటానికి ఇండియా వచ్చిన సీఫెర్ట్ ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. అయితే అహ్మదాబాద్‌లో మ్యాచ్‌లు ఆడటానికి వెళ్లిన కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టులో పలువురు క్రికెటర్లు కరోనా బారిన పడ్డారు. దీంతో ఐపీఎల్‌ను వాయిదా వేయడంతో క్రికెటర్లు అందరూ తమ స్వస్థలాలకు బయలుదేరారు. విదేశీ క్రికెటర్లు కూడా బీసీసీఐ ఏర్పాటు చేసిన విమానాల్లో తమ స్వదేశాలకు వెళ్లడానికి సిద్దపడ్డారు. న్యూజీలాండ్‌కు చెందిన సీఫెర్ట్ కూడా విమానం ఎక్కే ముందు కరోనా పరీక్షలు చేయించుకోగా పాజిటివ్‌గా తేలాడు. దీంతో ఇండియాలోనే చికిత్స తీసుకోవాల్సి వచ్చింది. పది రోజుల పాటు చెన్నైలో చికిత్స పొందిన సీఫెర్ట్ తర్వాత కోలుకున్నాడు. దీనిపై తాజాగా తన అనుభవాన్ని పంచుకున్నాడు.

‘కరోనా పాజిటివ్ అని తేలగానే ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యాను. నేను పాజిటివ్ అని సీఎస్కే మేనేజర్ నాకు చెప్పాడు. దీంతో ఒక్కసారిగా ప్రపంచం మొత్తం ఆగిపోయినట్లు అనిపించింది. అసలు ఏం చేయాలో అర్థం కాలేదు. ఇండియాలో కరోనా బాధితులకు ఏమి జరుగుతున్నతో రోజు చూస్తూ ఉండటంతో నాకు మరింత ఆందోళన కలిగింది. పేపర్లు, టీవీ చూస్తుంటే ఆక్సిజన్ కొరత వార్తలే తెలుస్తుండటంతో నాకు కూడా అలాంటి పరిస్థితే ఎదురవుతుందేమో అని భయపడ్డాను. కానీ కోల్‌కతా నైట్ రైడర్స్, చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం నన్ను చాలా జాగ్రత్తగా చూసుకొన్నాయి. ఈ రోజు నేను ఇలా ఉండటానికి కారణం ఆ రెండు ఫ్రాంచైజీలే కారణం’ అని సీఫెర్ట్ కన్నీరు మున్నీరుగా విలపించాడు.

Next Story

Most Viewed