Taliban in Afghanistan: ఆఫ్ఘనిస్తాన్‌ ప్రజలు, ఉద్యోగులపై తాలిబన్ల కీలక ప్రకటన

by vinod kumar |   ( Updated:2023-03-30 17:26:56.0  )
Taliban
X

దిశ, తెలంగాణ బ్యూరో : ఆఫ్ఘనిస్తాన్‌ను హస్తగతం చేసుకున్న తాలిబన్లు సంచలన నిర్ణయం తీసుకున్నారు. దేశ ప్రజలందరికీ క్షమాభిక్ష ప్రసాదిస్తున్నామని ప్రకటించారు. ప్రభుత్వ ఉద్యోగులు తిరిగి విధుల్లో చేరాలని ఆదేశించారు. ‘ప్రతి ఒక్కరికీ క్షమాభిక్ష ప్రకటిస్తున్నాం. అందువల్ల మీరు పూర్తి విశ్వాసం, భరోసాతో జీవనం సాగించండి. ప్రజలంతా సాధారణ, రోజువారీ కార్యకలాపాలు కొనసాగించుకోవచ్చు. ప్రభుత్వ అధికారులంతా విధులకు హాజరుకావాలి’ అని తాలిబన్లు ఓ ప్రకటన విడుదల చేశారు.

ఆఫ్ఘన్‌ తాలిబన్ల వశమవడంతో అక్కడి ప్రజలు తీవ్ర భయభ్రాంతులకు గురవుతున్నారు. మళ్లీ చీకటిరోజులు తప్పవని భీతిల్లుతున్నారు. ప్రజలు దేశం నుంచి పారిపోయేందుకు విమానాశ్రయాలకు పోటెత్తుతున్నారు. అత్యంత ప్రమాదకర పరిస్థితుల్లో ప్రయాణిస్తూ ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. ఈ నేపథ్యంలో తాలిబన్లు క్షమాభిక్ష ప్రకటన చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. అమెరికా నేతృత్వంలోని కూటమి తరఫున పని చేసిన వారిపై తామేమీ ప్రతీకారం తీర్చుకోబోమని తాలిబన్‌ సహ వ్యవస్థాపకుడు అబ్దుల్‌ ఘనీ బరాదర్‌ హామీ ఇచ్చారు. ఆఫ్ఘన్ ప్రజల్లో అనవసరపు భయాందోళనలను రేకెత్తించవద్దని అంతర్జాతీయ సమాజాన్ని కోరారు. యథావిధిగా పనులకు వెళ్లాలని తాలిబన్లు టీవీల్లో ప్రకటనలు కూడా ఇచ్చారు.


Advertisement

Next Story