Stock Market: మళ్లీ నష్టాల్లోనే సూచీలు!

by Harish |   ( Updated:2022-04-06 11:54:15.0  )
Stock Market: మళ్లీ నష్టాల్లోనే సూచీలు!
X

ముంబై: దేశీయ ఈక్విటీ మార్కెట్లు మళ్లీ నష్టాలను ఎదుర్కొన్నాయి. బుధవారం ఉదయం ట్రేడింగ్ ప్రారంభమైన దగ్గరినుంచి నష్టాలతోనే కొనసాగిన సూచీలు చివరి వరకు అదే ధోరణిలో కదలాడాయి. ముఖ్యంగా గత వారం రోజులుగా స్టాక్ మార్కెట్లు వరుస లాభాలతో కొనసాగుతున్న తరుణంలో మదుపర్లు లాభాలను వెనక్కి తీసుకునేందుకు మొగ్గు చూపుతున్నారు. దీనికి తోడు అంతర్జాతీయంగా అమెరికా వడ్డీ రేట్ల పెరుగుదలకు సంబంధించిన సంకేతాలు, చైనాలోని కీలక ప్రాంతం షాంఘైలో లాక్‌డౌన్, ముడి చమురు ధరలు, ద్రవ్యోల్బణ ఆందోళన కారణంగా దేశీయ స్టాక్ మార్కెట్లపై ప్రభావం ఎక్కువగా ఉంది. అంతేకాకుండా దేశీయంగా ఆర్‌బీఐ సమావేశంలో తీసుకునే నిర్ణయాలకు సంబంధించి మదుపర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు.

దీంతో మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 566.09 పాయింట్లు కుదేలై 59,610 వద్ద, నిఫ్టీ 149.75 పాయింట్లు క్షీణించి 17,807 వద్ద ముగిశాయి. నిఫ్టీలో కీలకమైన ఫైనాన్స్, ఐటీ రంగాలు 1.50 శాతానికి పైగా నిరసించాయి. మెటల్, పీఎస్‌యూ బ్యాంక్ రంగాలు రాణించాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో ఎన్‌టీపీసీ, టాటా స్టీల్, పవర్‌గ్రిడ్, భారతీ ఎయిర్‌టెల్, నెస్లె ఇండియా, ఎల్అండ్‌టీ షేర్లు లాభాలను దక్కించుకోగా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, హెచ్‌సీఎల్ టెక్, టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్, టీసీఎస్, కోటక్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ షేర్లు అధిక నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 75.75 వద్ద ఉంది.

Advertisement

Next Story