నష్టపోయిన ప్రతి ఒక్కరినీ ఆదుకుంటాం

by Sridhar Babu |
నష్టపోయిన ప్రతి ఒక్కరినీ ఆదుకుంటాం
X

దిశ, మరిపెడ : ఊహించని వరద ముప్పుతో నిరాశ్రులైన మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం సీతారాంతండా గిరిజన కుటుంబాలను రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరామర్శించి ధైర్యం చెప్పారు. ప్రభుత్వం అండగా ఉంటుందంటూ భరోసా ఇచ్చారు. అంతముందుకు మరిపెడ మండలం పురుషోత్తమయగూడెం వద్ద ఆకేరు నది వరద ఉధృతికి గల్లంతైన తండ్రి,కూతురి కుటుంబాన్ని ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం గంగారం తండాలో పరామర్శించి నివాళులర్పించారు. అనంతరం రోడ్డు మార్గాన జాతీయ రహదారి 365 పై తన కాన్వాయ్​లను నిలిపివేసి సీతారాం తండాకు నడకమార్గాన చేరుకొని ముంపు బాధితులను పరామర్శించి ధైర్యం చెప్పారు. ఊహించని విధంగా ప్రకృతి ప్రకోపం చూపించిందని, ముందస్తు చర్యలు తీసుకున్నప్పటికీ ప్రాణ, ఆస్తి నష్టం సంభవించడం పట్ల ముఖ్యమంత్రి విచారం వ్యక్తం చేశారు.

నష్టపోయిన ప్రతి ఒక్కరిని ప్రభుత్వం ఆదుకుంటుందని, తక్షణ సాహాయం కింద పది రోజులకు సరిపడా నిత్యావసర సరుకులు, చేతి ఖర్చులకు పదివేల రూపాయల నగదు అందించాలని జిల్లా కలెక్టర్ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఇళ్లు మునగడంతో రైతుల పట్టా పాస్ బుక్ లు, ఆధార్ కార్డ్ లు, విద్యార్థుల సర్టిఫికెట్లు, ఆస్తి పత్రాలు, ఇతర ముఖ్య పత్రాలు పాడై ఉంటాయని వాటి గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఎఫ్ఐఆర్ నమోదు చేసి వాటి స్థానంలో కొత్తవి మంజూరు చేయాలని కలెక్టర్ ను ముఖ్యమంత్రి ఆదేశించారు. అవసరమైతే ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుంటుందని వివరించారు.

ఎప్పుడు వరదలు వచ్చినా ఈ ప్రాంతానికి ఇబ్బందులు తప్పట్లేదని భవిష్యత్తులో ఇబ్బందులకు తావు లేకుండా ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చేసేందుకు కలెక్టర్,నేషనల్ హైవే, ఇరిగేషన్, ఆర్అండ్​బీ అధికారులు, టెక్నికల్ ఎక్స్పర్స్ తోటి సర్వే చేసి శాశ్వత పరిష్కారం చూపాలని అన్నారు. అలాగే మూడు గ్రామాలను కలిపి ఒక పెద్ద గ్రామ పంచాయతీ ఏర్పాటు చేయాలని ఆకేరు దూర ప్రాంతంలో స్థలాన్ని కేటాయించి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. మృతులకు ఐదు లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించారు. అనంతరం దెబ్బ తిన్న పంటలను, రోడ్లను పరిశీలించారు. ఈ ముంపు ప్రాంతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంట మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్క, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, ఎంపీ బలరాం నాయక్, మహబూబాబాద్, డోర్నకల్ శాసనసభ్యులు, మురళి, రామచంద్రునాయక్, నూకల నరేష్ రెడ్డి, వేం నరేందర్ రెడ్డి, జిల్లా ఎస్పీ కలెక్టర్ లు ఉన్నారు. అనంతరం జిల్లా కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన రివ్యూ మీటింగ్ కి ముఖ్యమంత్రి బయలుదేరి వెళ్లారు.

Advertisement

Next Story

Most Viewed