వరంగల్‌ జిల్లాలో ‘డబుల్’ లొల్లి...!

by srinivas |
వరంగల్‌ జిల్లాలో ‘డబుల్’ లొల్లి...!
X

దిశ‌, వ‌రంగ‌ల్ బ్యూరో: అంబేద్కర్‌ నగర్‌, జితేందర్‌నగర్‌లోని గుడిసెవాసులకు డ‌బుల్ బెడ్రూం ఇళ్ల పంపిణీకి గ్రహ‌ణం వీడ‌డం లేదు. హన్మకొండ బాలసముద్రంలోని అంబేద్కర్‌ నగర్‌, జితేందర్‌నగర్‌లోని గుడిసెవాసుల గుడిసెలు ఖాళీ చేయించి మ‌రీ ఆ స్థలంలోనే 592 ఇళ్ల నిర్మాణాన్ని నాలుగేళ్ల క్రితం పూర్తి చేశారు. అయితే గ‌త ప్రభుత్వం ఇళ్ల పంపిణీ విష‌యంలో తీవ్ర నిర్లక్ష్యం, జాప్యం చేసింది. మాజీ సీఎం కేసీఆర్‌ 2015 జ‌న‌వ‌రి నెల‌లో హ‌న్మకొండ అంబేద్కర్ న‌గ‌ర్‌లో ప‌ర్యటించి మురికి వాడ‌లో జీవిస్తున్న పేద‌ల క‌ష్టాల‌కు చ‌లించి వెంట‌నే డ‌బుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణానికి ఆదేశాలు జారీ చేశారు. అయితే ఈ ప‌నులు పూర్తవ‌డానికి ఐదేళ్లు ప‌డితే... ఇళ్ల నిర్మాణం పూర్తయి ఇప్పుడు నాలుగేళ్లు దాటుతున్నా పంపిణీపై నిర్లక్ష్యం కొన‌సాగుతూనే ఉంది. డ‌బుల్ బెడ్రూం ఇళ్లు త‌క్కువ‌గా, అర్హత క‌లిగిన వారు ఎక్కువ‌గా ఉండ‌డంతో ఎంపిక చేయ‌ని వారి నుంచి వ్యతిరేక‌త వ‌చ్చి రాజ‌కీయంగా ఇబ్బందిక‌ర ప‌రిస్థితులు ఎదుర‌వుతాయ‌నే ఉద్దేశంతోనే అప్పటి ఎమ్మెల్యే విన‌య్‌భాస్కర్ ఈ విష‌యంలో ముంద‌డుగు వేయ‌లేక నాన్చుతూ వ‌చ్చార‌న్న విమ‌ర్శలున్నాయి. ఇక ప్రస్తుత ఎమ్మెల్యే నాయిని సైతం కాసింత వెనుకంజ వేస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే నాయిని ఓ ప్రెస్‌మీట్‌లో మాట్లాడుతూ త్వర‌లోనే ఇళ్ల పంపిణీ చేప‌డ‌తామ‌ని, అర్హులైన వారికి ఇళ్లు ద‌క్కేలా పార‌ద‌ర్శకంగా పంపిణీ చేస్తామ‌ని ప్రక‌టించారు.

ఆత్మహ‌త్యాయ‌త్నాలు జ‌రిగినా వాయిదానే..

అంబేద్కర్ న‌గ‌ర్‌లో నిర్మాణం పూర్తయినా డ‌బుల్ బెడ్రూం ఇళ్లు పంపిణీ చేప‌ట్టాల‌ని పేద‌ల ప‌లుమార్లు ఆందోళ‌న నిర్వహించారు. ఒక‌టి రెండుసార్లు ఏకంగా పెట్రోల్ చేత బూని త‌మ‌కు ఇళ్ల కేటాయింపు చేప‌ట్టకుంటే ఆత్మహ‌త్య చేసుకుంటామ‌ని నిర‌స‌న‌కు దిగారు. పేద‌లు ఆందోళ‌న‌కు దిగిన ప్రతీసారి సంబంధిత అధికారుల‌ను పంపించి బుజ్జగించి ఆందోళ‌న‌ను విర‌మించేలా చేస్తున్నారు త‌ప్పితే పంపిణీకి మాత్రం చ‌ర్యలు తీసుకోక‌పోవ‌డం గ‌మ‌నార్హం. ఇదే విష‌యంపై గ‌త ప్రభుత్వ హ‌యాంలో కేటీఆర్ వ‌ద్దకు కొంత‌మంది పేద‌లు నేరుగా క‌లువ‌డంతో స్పందించిన ఆయ‌న శాఖ అధికారుల‌కు ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటి వ‌ర‌కు ఆరుగురు లబ్ధిదారులకు మాత్రమే అలాట్​మెంట్ పేపర్లు అందించారు. కానీ ఇంతవరకు వారిని సైతం ఆయా ఇళ్లల్లోకి వెళ్లేందుకు అనుమ‌తి ఇవ్వక‌పోవ‌డం గ‌మ‌నార్హం.

మ‌ళ్లీ మొద‌లైన ఆందోళ‌న‌లు..

డబుల్‌ బెడ్రూం ఇండ్లు కేటాయించాల్సిందేనని, అప్పటి వరకు ఇక్కడి నుంచి కదిలేదంటూ హన్మకొండలోని అంబేద్కర్‌ నగర్‌, జితేందర్‌నగర్‌లోని గుడిసెవాసులు భీష్మించుకు కూర్చున్నారు. ఆదివారం అంబేద్కర్‌నగర్‌లో నిర్మించిన ఇళ్ల వద్దకు చేరుకొని తాళాలు పగులగొట్టి అందులోకి వెళ్లి శుభ్రం చేసుకున్నారు. సుబేదారి పోలీసులు అక్కడికి వెళ్లి గుడిసెవాసులకు సర్దిచెప్పే ప్రయత్నం చేసినప్పటికీ వారు ససేమిరా అన్నారు. దీంతో ఇళ్ల నుంచి వారిని పోలీసులు బలవంతంగా బయటకు పంపించడంతో అక్కడే బైఠాయించి ధర్నా చేపట్టారు. చివరకు ఆయన కలెక్టర్‌ దృష్టికి ఇండ్ల పంపిణీ విషయం తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇవ్వడంతో గుడిసెవాసులు ఆందోళన విరమించారు. ఆందోళ‌న‌ల వెనుక బీఆర్ఎస్ నేత‌ల హ‌స్తం ఉంద‌ని కాంగ్రెస్ నేత‌లు ఆరోపిస్తున్నారు. డ‌బుల్ బెడ్రూం ఇళ్లు కేటాయిస్తామంటూ పెద్ద ఎత్తున వ‌సూళ్లకు పాల్పడిన వారూ, డ‌బ్బులు తీసుకుని కూడా కేటాయించ‌లేక‌పోయారంటూ కాంగ్రెస్ నేత‌లు ఆరోపిస్తున్నారు. త్వర‌లోనే అర్హుల‌కు అంద‌జేస్తామ‌ని చెబుతున్నా కావాల‌నే గుడిసెవాసుల‌ను రెచ్చగొడుతున్నారంటూ మండిప‌డుతున్నారు.



Next Story