Collector Advait Kumar Singh : అధికారులు అంకితభావంతో పని చేయాలి

by Sridhar Babu |
Collector Advait Kumar Singh : అధికారులు అంకితభావంతో పని చేయాలి
X

దిశ, మహబూబాబాద్ టౌన్ : అధికారులు అంకితభావంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ అన్నారు. శుక్రవారం కొత్తగూడ మండల కేంద్రం రైతు వేదికలో కొత్తగూడెం, గంగారం మండలాలకు సంబంధించి, సీజనల్ వ్యాధులు అంతర్గత అభివృద్ధి పనులు, స్త్రీ శిశు సంక్షేమంపై సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రస్తుత వర్షాకాలం నేపథ్యంలో గ్రామాలలో టీబీ, న్యూట్రిషన్ ఎన్ సీడీ ప్రాజెక్టు అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించి క్షేత్రస్థాయిలో ప్రజలకు సేవలందించాలని, సబ్ సెంటర్స్ ,అంగన్వాడీ కేంద్రాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వారీగా స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని, జిల్లాస్థాయిలో యాక్షన్ ప్లాన్ ప్రకారం విధులు నిర్వహించాలని కోరారు. ప్రతి (15) రోజులకు ఒకసారి అభివృద్ధి సంక్షేమ పథకాలపై సమీక్ష సమావేశం నిర్వహించనున్నట్టు తెలిపారు. సంబంధిత అధికారులు పెండింగ్ పనులు ఉంటే వెంటనే పూర్తి చేయాలని, ప్రజావాణి దరఖాస్తులను పరిశీలించి పరిష్కరించాలని కోరారు. గ్రామస్థాయిలో పంచాయతీ కార్యదర్శి గ్రామపంచాయతీ పరిధిలోని అన్ని

వసతి గృహాలు సీజనల్ వ్యాధులను అరికట్టడం, శానిటైజేషన్, వాటర్ ట్యాంక్స్ శుభ్రత, క్లోరినేషన్, గ్రామాలలో క్లీనింగ్ పనులను నిత్యం పర్యవేక్షిస్తూ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అవగాహన కల్పించాలని ఆదేశించారు. మండలాల పరిధిలో శ్యామ్, మామ్ కేసులను నార్మల్ స్థాయికి తీసుకురావడానికి వారి తల్లిదండ్రులను ఒప్పించి ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. అనంతరం మండల కేంద్రంలోని గిరిజన బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాలను, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. 260 మంది బాలికలు చదువుకుంటున్న ఈ ఉన్నత పాఠశాలలో పిల్లలకు అందిస్తున్న సౌకర్యాల గురించి వివరాలు అడిగి తెలుసుకుని, స్వయంగా హాస్టల్లోని కిచెన్, టాయిలెట్స్, వంటగది, మెడికల్ రూమ్, డైనింగ్ హాల్, క్లాస్ రూమ్లను తనిఖీ చేసి హాస్టల్లో పరిశుభ్రత పాటించాలని పిల్లలకు ఆహ్లాదకరమైన వాతావరణంలో విద్యా బోధనలు అందించాలని టీచర్లను ఆదేశించారు.

ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆకస్మికంగా తనిఖీ చేసి కేంద్రంలోని ల్యాబ్ ఫార్మసీ, ఔట్ పేషెంట్, ఇన్ పేషెంట్ ,ఎంసీడీ కౌంటర్, ఐపీ రూమ్, డెలివరీ రూమ్ ఆపరేషన్ థియేటర్ లను తనిఖీ చేశారు. నార్మల్ డెలివరీ అయిన కొత్తగూడ మండలం పోలారం గ్రామానికి చెందిన మహేశ్వరి తో మాట్లాడుతూ అందుతున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు. సబ్ సెంటర్ పరిధిలో నార్మల్ డెలివరీలను ప్రోత్సహించాలని సూచించారు. ఆశా కార్యకర్తలు క్షేత్రస్థాయిలో సక్రమంగా నిధులు నిర్వహిస్తే గ్రామాలు ఆరోగ్యంగా ఉంటాయని, అందుకు అంకితభావంతో పనిచేయాలని కోరారు. ప్రతి ఒక్క ఉద్యోగి విధుల పట్ల అంకితభావంతో శ్రద్ధగా పనిచేయాలని, నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తీసుకుంటామన్నారు. కొత్తగూడ, గంగారం మండలాలకు సాంఘిక సంక్షేమ శాఖ హాస్టల్ ఒకటే ఉందని మరొకటి మంజూరు చేయాలని స్థానికులు కలెక్టర్ ను కోరారు. ఈ సమీక్ష సమావేశంలో అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు ) లెనిన్ వత్సాల్ టోప్పో, జిల్లా పరిషత్ సీఈవో నర్మదా, వైద్యాధికారిణి డాక్టర్ కళావతి భాయి, డీపీఓ హరిప్రసాద్, డీడబ్ల్యూఓ వరలక్ష్మి, కొత్తగూడ మండల ప్రత్యేక అధికారి సురేష్, తహసీల్దార్ రమాదేవి, ఎంపీడీవో రవీంద్ర ప్రసాద్, మెడికల్ ఆఫీసర్ డాక్టర్ శివప్రసాద్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.



Next Story