స్వతంత్ర దినోత్సవ వేడుకలకు సర్వం సిద్ధంః కలెక్టర్ అద్వైత్

by Nagam Mallesh |
స్వతంత్ర దినోత్సవ వేడుకలకు సర్వం సిద్ధంః కలెక్టర్ అద్వైత్
X

దిశ, మహబూబాబాద్ టౌన్ః మహబూబాబాద్ పట్టణం, ఎన్టీఆర్ స్టేడియం లో జరగబోయే 78 వ భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు సర్వం సిద్ధం అయినట్టు కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ అన్నారు. ఏర్పాట్లను జిల్లా ఎస్పీ ఎస్.ఆర్ కేకన్, అదనపు కలెక్టర్ (రెవెన్యూ) డేవిడ్, సంబంధిత అధికారులతో కలిసి జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రేపు జరిగే వేడుకలకు ముఖ్యఅతిథిగా ప్రభుత్వ విప్, డోర్నకల్ శాసనసభ్యులు శ్రీ జాటోత్ రామచంద్రనాయక్, హాజరై జాతీయ జెండా ఆవిష్కరణ చేసి ప్రసంగిస్తారన్నారు. వేడుకలకు వచ్చే స్వతంత్ర సమరయోధులు, పుర ప్రముఖులు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు, అతిధులకు ప్రోటోకాల్ ప్రకారం తగిన ఏర్పాట్లు చేయాలని, గ్రౌండ్లో సానిటేషన్, త్రాగునీరు, తదితర సౌకర్యాలు కల్పించాలన్నారు. వర్షాకాలం నేపథ్యంలో అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేయాలని రోడ్ల భవనాల శాఖ అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ చెన్నయ్య, మహబూబాబాద్ ఆర్డిఓ అలివేలు, జడ్పీ సీఈవో నర్మదా, మున్సిపల్ కమిషనర్ రవీందర్, డి ఏ ఓ అభిమన్యుడు, డిహెచ్ఓ మరియన్న, స్థానిక తాసిల్దార్ భగవాన్ రెడ్డి, సంబంధిత అధికారులు ఉన్నారు.

Next Story