'కేసీఆర్‌‌ను పాకిస్తాన్​ఉగ్రవాదులు కూడా కాపాడలేరు'

by GSrikanth |
కేసీఆర్‌‌ను పాకిస్తాన్​ఉగ్రవాదులు కూడా కాపాడలేరు
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాబోయే ఎన్నికల్లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఓటమి నుంచి ఎవరూ కాపాడలేరని, పాకిస్తాన్ ఉగ్రవాదులు వచ్చినా ఆయనకు ఓటమి ఖాయమని కేంద్ర మంత్రి కిషన్​రెడ్డి విమర్శలు చేశారు. నగరంలోని చంపాపేటలో నిర్వహించిన హైదరాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్​సమావేశంలో ఆయన మాట్లాడారు. కేసీఆర్ తాటాకు చప్పుళ్లకు భయపడే పార్టీ బీజేపీ కాదని అన్నారు. తెలంగాణలో కల్వకుంట్ల కుటుంబం పోయి..‌ బీజేపీ ప్రభుత్వం రావాలని ప్రజలంతా కోరుకుంటున్నారన్నారు. తన పాలనలో అన్ని వర్గాలను మోసం చేయటమే కేసీఆర్ తీసుకొచ్చిన గుణాత్మమైన మార్పు అని మండిపడ్డారు. సచివాలయానికి రాకుండా పాలన చేయటమే కేసీఆర్ గుణాత్మకమైన మార్పా?, దళితులకు వెన్నుపోటు పొడవటమే గుణాత్మకమైన మార్పా అని ప్రశ్నించారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వకపోవడమే కాక, అన్ని వర్గాలను కేసీఆర్ మోసం చేశారన్నారు. తమది టీఆర్ఎస్ లాగా కుటుంబ పార్టీ కాదని విమర్శలు చేశారు.

ఇప్పుడు ఇతర రాష్ట్రాల్లో పర్యటిస్తూ దేశంలో కూడా కల్వకుంట్ల కుటుంబ పెత్తనం చేయాలని కేసీఆర్​కలలు కంటున్నాడని ఎద్దేవా చేశారు. బంగారు తెలంగాణ కాలేదని, కేసీఆర్​కుటుంబం మాత్రం బంగారమైందని సెటైర్లు వేశారు. భారత్​నుంచి బీజేపీని తరమికొట్టే శక్తి ప్రపంచంలో ఎవరకీ లేదని మండిపడ్డారు. వరి ధాన్యం‌ కొనేది కేంద్రమేనని తెలంగాణ రైతులకు తెలిసిపోయిందని కిషన్​రెడ్డి అన్నారు. పొదుపు సంఘాలను తెలంగాణ ప్రభుత్వం అన్యాయం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీపై కక్ష కట్టిన కుటుంబ పార్టీలకు బుద్ధి చెబుతామని కేంద్ర మంత్రి కిషన్​రెడ్డి హెచ్చరించారు.

Advertisement

Next Story