Union Budjet: బడ్జెట్ కొన్ని రాష్ట్రాలకే ప్రవేశ పెట్టడం బాధాకరం.. మాజీమంత్రి హరీష్ రావు

by Ramesh Goud |   ( Updated:2025-02-01 10:42:24.0  )
Union Budjet: బడ్జెట్ కొన్ని రాష్ట్రాలకే ప్రవేశ పెట్టడం బాధాకరం.. మాజీమంత్రి హరీష్ రావు
X

దిశ, వెబ్ డెస్క్: కేంద్రమంత్రి నిర్మల సీతారామన్(Union Minister Nirmala Sitharaman) మాటలు బడ్జెట్ కు విరుద్దంగా ఉన్నాయని, యావత్ దేశానికి సరిపోయే బడ్జెట్ ఎప్పుడు పెడతారని మాజీమంత్రి హరీష్ రావు(Harish Rao Thanneeru) విమర్శించారు. కేంద్ర బడ్జెట్(Union Budjet) పై ట్విట్టర్ వేదికగా స్పందించిన ఆయన.. బీజేపీ ప్రభుత్వం(BJP Government)పై విమర్శలు చేశారు. బడ్జెట్ పై ఆయన.. 2025-26 బడ్జెట్ తన రాజకీయ అవసరాలే ఉపయోగించుకున్నది తప్ప, దేశ సమ్మిళిత వృద్ధిని ఏమాత్రం పట్టించుకున్నట్లు లేదని, కేంద్ర ప్రభుత్వం పదే పదే వల్లెవేస్తున్న వికసిత్ భారత్ ఇలాంటి వైఖరితో సాధ్యమవుతుందా అని పునర్ సమీక్షించుకోవాలని కోరారు. అలాగే ఎన్నికలు ఉన్న రాష్ట్రాలకు పెద్ద మొత్తంలో వరాలు ప్రకటించి, ఎన్నికలు లేని రాష్ట్రాల పట్ల వివక్ష చూపడం సరికాదన్నారు. దేశమంటే మట్టి కాదోయో దేశమంటే మనుషులోయ్ అంటూ ప్రసంగించిన నిర్మల సీతారామన్ దేశమంటే కొన్ని రాష్ట్రాలే అన్నట్లు బడ్జెట్ ప్రవేశ పెట్టడం బాధాకరమని అన్నారు. అంతేగాక కేంద్ర ప్రభుత్వం మొదటి నుంచి ఇదే దోరణిని ప్రదర్శిస్తూ రాజకీయ అవసరాలు తీర్చుకుంటున్నదని దుయ్యబట్టారు.

2024 ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ అని, 2025 ఢిల్లీ, బిహార్ రాష్ట్రాల కోసం బడ్జెట్ పెట్టారని, 2026 యూపీ బడ్జెట్ అని, 2027 గుజరాత్ కోసం బడ్జెట్ పెడుతారా? అంటూ.. యావత్ దేశానికి సరిపోయే బడ్జెట్ ఎప్పుడు పెడతారు? అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఇక బడ్జెట్ లో తెలంగాణ రాష్ట్రానికి చోటు లేదా? తెలంగాణ ప్రాంత ప్రయోజనాలకు విలువ లేదా? అని, ఇది కేంద్ర బడ్జెట్ లా లేదు.. కేవలం మూడు, నాలుగు రాష్ట్రాల బడ్జెట్ లాగా ఉందని మండిపడ్డారు. తెలంగాణ(Telangana) నుంచి ఇద్దరు కేంద్ర మంత్రులు, 8 మంది ఎంపీలు ఉండి తెలంగాణ రాష్ట్రానికి ఏం సాధించినట్లు? అని, తెలంగాణతో తమకు బంధం లేదని బడ్జెట్ ద్వారా మరోసారి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నిరూపించిందని స్పష్టం చేశారు. కేంద్ర జీడీపీకి 5.1శాతం కాంట్రిబ్యూట్ చేస్తున్న తెలంగాణ మరోసారి మోసపోయిందని, ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం ట్రైబల్ యూనివర్సిటీకి ఇవ్వాల్సిన నిధులు కూడా ఇవ్వకపోవడం బాధాకరమని అన్నారు.

తెలంగాణకు నిధులు రాబట్టుకోవడంలో రేవంత్ సర్కారు పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. ఇక తీరిగ్గా తేరుకొని, బడ్జెట్ కు పది రోజుల ముందు 40వేల కోట్లు కావాలని తూతూ మంత్రంగా లేఖ రాయడం తప్ప రాష్ట్ర ప్రయోజనాల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందేం లేదని, కేంద్రం బడ్జెట్ ద్వారా నిధులు రాబట్టుకోవడంలో సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy), రాష్ట్ర కాంగ్రెస్(Congress) ఎంపీలు పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు. ఏడాది కాలంలో 30 సార్లకు పైగా ఢిల్లీకి వెళ్లారు. ఏం సాధించారో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలని నిలదీశారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీల తీరు వల్ల తెలంగాణకు తీరని అన్యాయం జరిగిందని, నిధుల కేటాయింపు సంగతి దేవుడెరుగు, విభజన చట్టంలో పొందుపరిచిన హామీలను కూడా కేంద్రం నెరవేర్చలేకపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సంకీర్ణ యుగంలో, కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు స్థానిక పార్టీల మద్ధతు కీలకం అయ్యే రోజొకటి వస్తుందని కేసీఆర్ ఎప్పుడూ చెప్పేవారని, కేంద్రానికి మద్ధతు పలికిన జనతాదళ్(యూ) బీహార్‌లో వివిధ అభివృద్ధి పనులకు గతేడాది రూ. 26,000 కోట్ల సాయం, 2,400 మెగావాట్ల పవర్ ప్లాంట్, గయాలో పారిశ్రామిక కారిడార్, నూతన విమానాశ్రయాలు, మెడికల్ కాలేజీలకు సాయం తదితరాలు పొందిందని చెప్పుకొచ్చారు.

ఇక ఎన్నికలు దగ్గర ఉన్నాయని ఇప్పటి బడ్జెట్ లో బీహార్ కు మరిన్ని వరాల జల్లు కురిపించారని, బిహార్ లో మఖాన బోర్డు ఏర్పాటు.. మిథిలాంచల్ లో వెస్టర్న్ కోసి కెనాల్.. ఐఐటీ పాట్నా విస్తరణ.. బీహార్ లో గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టు.. ఫడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారని, కానీ నమ్మి 16 సీట్లలో కాంగ్రెస్, బీజేపీలను గెలిపిస్తే, ఇద్దరూ కలిసి తెలంగాణకు మొండి చెయ్యి ఇచ్చారని సంచలన వ్యాఖ్యలు చేశారు. 8 మంది బీజేపీ, 8 మంది కాంగ్రెస్ ఎంపీలు, రాష్ట్రానికి ప్రత్యేకంగా 8 రూపాయలు కూడా అధికంగా సాధించిన దాఖలాలు లేవని, కేంద్రం ఇతర రాష్ట్రాలకు కేటాయింపులు చేయడం సంతోషం, ఇందులో మాకు ఎలాంటి బాధ లేదు. కానీ తెలంగాణ పరిస్థితి ఏమిటో కాంగ్రెస్, బీజేపీ ఎంపీలు చెప్పాలని ప్రశ్నించారు. తెలంగాణలో ప్రాజెక్టుల సంగతి ఏమిటి? అని, పునర్విభజన చట్టం హామీల పరిస్థితి ఏమిటి? అని, ప్రశ్నించాల్సిన కాంగ్రెస్, బీజేపీ ఎంపీలు(BJP MPs) మౌనం దాల్చారు అని ఫైర్ అయ్యారు. కేంద్రం మెప్పు కోసం తెలంగాణ ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నారని, తెలంగాణకు ప్రయోజనాల కోసం, తెలంగాణ ప్రజల కోసం ఎప్పటికైనా పోరాడేది బీఆర్ఎస్ పార్టీయేనని మరోసారి రుజువైందని చెప్పారు. ఇక తెలంగాణ ప్రయోజనాలు కాపాడటంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు వైఫల్యం చెందుతున్నాయన్న విషయాన్ని రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారని బీఆర్ఎస్ నేత వ్యాఖ్యానించారు.

https://x.com/BRSHarish/status/1885612777479532819

Next Story