TPCC: ఎన్నికల వరకే పార్టీలు.. అలయ్ బలయ్‌లో పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్

by Ramesh Goud |
TPCC: ఎన్నికల వరకే పార్టీలు.. అలయ్ బలయ్‌లో పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్
X

దిశ, డైనమిక్ బ్యూరో: హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ ఆధ్వర్యంలో నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో ఏర్పాటు చేసిన అలయ్ బలయ్ కార్యక్రమానికి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. పార్టీలకు అతీతంగా.. కుల మతాలకు అతీతంగా జరిపే ఈ అలయ్ బలయ్ కార్యక్రమం రాష్ట్రంలోనే గాక దేశంలోనే ఆకర్షణ పొందిన కార్యక్రమమని అన్నారు. దసరా తర్వాత అందరినీ కలుసుకుని శుభాకాంక్షలు తెలిపే అవకాశాన్ని దత్తాత్రేయ గత 18 ఏళ్లుగా కల్పిస్తున్నారని తెలిపారు. ఎన్నికల వరకే పార్టీలు ఉండాలని ఎన్నికల తర్వాత మన రాష్ట్రాన్ని అభివృద్ది చేసుకునేందుకు, మన సాంప్రదాయాలను కాపాడుకునేందుకు అందరూ కలిసి ముందుకు రావాల్సిన అవసరం ఉందని చెప్పారు.

దత్తాత్రేయతో 1980 నుంచి స్నేహం ఉందని, కిషన్ రెడ్డితో 1990 నుంచి పరిచయం ఉందని, మిత్రుత్వంలో పార్టీలు, ప్రాంతాలు అడ్డురావని, స్నేహం పార్టీలు, ప్రాంతాలు, కులమతాలకు అతీతంగా ఉండాలని, దాని వల్లే సమాజం ముందుకు పోతుందని స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో పార్టీలకతీతంగా కేంద్రంలో ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా, రాష్ట్రంలో ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా.. పరస్పరం సహకారం అందించుకుంటూ.. రాష్ట్రాన్ని అభివృద్ది చేసుకోవాలని కోరుకునే వ్యక్తుల్లో తాను ఒకడినని చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో ఎన్నో పార్టీలు ఉన్నాయని, ఏ పార్టీ అధికారంలో ఉన్నా రాష్ట్ర అభివృద్ది కోసం పార్టీలకతీతంగా అందరూ కలిసి ముందుకు పోవాలని కోరుకున్నారు. అలయ్ బలయ్ కార్యక్రమం నిరాటంకంగా కొనసాగుతుందని, దత్తాత్రేయ తర్వాత వారి కూతురు విజయవంతంగా నడిపిస్తున్నారని, ఈ కార్యక్రమం ఎల్లప్పుడూ కొనసాగాలని కోరుకుంటున్నానని తెలిపారు.

Advertisement

Next Story