టన్నుల కొద్దీ చెత్త రోడ్లపైనే.. మరి డంపింగ్ యార్డు ఉన్నది ఎందుకో?

by Shiva |   ( Updated:2024-09-16 02:14:16.0  )
టన్నుల కొద్దీ చెత్త రోడ్లపైనే.. మరి డంపింగ్ యార్డు ఉన్నది ఎందుకో?
X

దిశ, కూకట్‌పల్లి: రోడ్లపై టన్నుల కొద్ది చెత్త పేరుకుపోయి అటు వైపు వెళ్లాలంటే ముక్కు మూసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. జీహెచ్‌ఎంసీ అధికారులు నిర్లక్ష్యం, పర్యవేక్షణ లోపంతో కైత్లాపూర్​డంపింగ్ యార్డు సమీపంలో రోడ్లపై చెత్త గుట్టలు గుట్టలుగా పేరుకుపోయి కంపు కొడుతోంది. చెత్త సేకరణ బాధ్యతలు తీసుకున్న రాంకీ సంస్థ విధుల్లో విఫలమవడంతో డంపింగ్ యార్డు నాలుగు దిక్కుల సుమారు 200 మీ. మేర చెత్త పేరుకుపోయి ఉంది. చెత్త సేకరణ, స్వచ్ఛ ఆటోల్లో బాల కార్మికులు పనిచేస్తున్నా పట్టించుకునే వారు కరువయ్యారు. గ్రేటర్ హైదరాబాద్ నగరాన్ని చెత్త రహిత నగరంగా తీర్చిదిద్దేందుకు గత ప్రభుత్వ హయాంలో జీహెచ్‌ఎంసీ రాంకీ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. కాలనీలో చెత్త తొలగించడం, స్వచ్ఛ ఆటోల్లో వచ్చిన చెత్తను డంపింగ్ యార్డులో సేకరించేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. రాంకీ సంస్థపై నిఘా వైఫల్యంతో డంపింగ్ యార్డులో ఉండాల్సిన చెత్త యార్డుకు నాలుగు దిక్కులా కుప్పలు కుప్పలుగా దర్శనమిస్తోంది. కైత్లాపూర్ డంపింగ్ యార్డు సమీపంలోని 15 ఫేజ్, కైత్లాపూర్ గ్రామం, 4వ ఫేజ్, కేపీహెచ్‌బీ కాలనీ పలు ఫేజ్‌లలో లక్షలాది సంఖ్యలో ప్రజలు నివాసం ఉంటున్నారు. రాత్రుళ్లు డంపింగ్ యార్డు నుంచి వచ్చే దుర్వాసనతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాత్రుళ్లు ఇంట్లో ఉండాలంటే భయపడాల్సిన పరిస్థితి ఉందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

వేల టన్నుల చెత్త

మూసాపేట్ సర్కిల్ పరిధిలోని కైత్లాపూర్‌లో ఉన్న డంపింగ్​యార్డు నిర్వహణ రాంకీ సంస్థ ఆధీనంలో ఉంది. కూకట్‌పల్లి, మూసాపేట్ జంట సర్కిళ్లతో పాటు పక్కనే ఉన్న చందానగర్ సర్కిల్‌తో పాటు ప్రైవేటు సంస్థల నుంచి సేకరించే వేల టన్నుల చెత్త కైత్లాపూర్ డంపింగ్​యార్డుకు తరలిస్తున్నారు. స్వచ్ఛ ఆటోలు, టిప్పర్ల ద్వారా వచ్చే చెత్తను డంపింగ్ యార్డులో డంప్ చేసేందుకు వేచి చూడాల్సి వస్తోంది. స్వచ్ఛ ఆటోలు రోజుకు కనీసం రెండు ట్రిప్పులు చెత్తను సేకరించాల్సి ఉంటుంది దీంతో క్యూలో ఉండకుండా ఆటో డ్రైవర్లు చెత్తను డంపంగి యార్డు బయటనే డంప్ చేసి వెళ్లిపోతున్నారు. అంతే కాకుండా చెత్త లోపలికి వెళ్లిన తరువాత అందులో ఉన్న ప్లాస్టిక్ బాటిళ్లు, పేపర్లు, కవర్లు, వేరు చేసుకునే వీలు ఉండకపోవడంతో స్వచ్ఛ ఆటో డ్రైవర్లు చెత్తను బయట డంప్ చేస్తున్నారు. చెత్త సేకరణలో ఉన్న స్వచ్ఛ ఆటోలను మైనర్లు నడుపుతున్నారు, ఆ చెత్తను వేరు చేసే పనులను వారే చేస్తున్నారు. బాల కార్మికులపై నిఘా పెట్టాల్సిన అధికారులు మొద్దు నిద్ర పోతున్నారు

చెత్త కుప్పల మధ్య నుంచే

కోర్టుకు కూకట్‌పల్లి కోర్టు ప్రాంగణం వెనుక భాగంలోనే డంపింగ్ యార్డు ఉంది. కోర్టుకు వెళ్లాలంటే 15 ఫేజ్ నుంచి డంపింగ్ యార్డు పక్క నుంచి ఉన్న సీసీ రోడ్డును లేదా హైటెక్​సిటీ ఎంఎంటీఎస్ రైల్వే‌స్టేషన్ పక్కనే ఉన్న రోడ్డు నుంచి వెళ్లాల్సి ఉంటుంది. కోర్టుకు వెళ్లే వారందరూ చెత్త కుప్పల మధ్య నుంచి వెళ్లాల్సిన పరిస్థతి ఎదురవుతోంది. కోర్టుకు వేళ్లేందుకు ఆ రోడ్డు గుండా వచ్చే వారు చెత్త కుప్పలను చూసి రోడ్డు లేదని తిరిగి వేరే దారి నుంచి వెళ్తున్నారు. 15వ ఫేజ్ నుంచి అంబేద్కర్ నగర్​, కోర్టు ప్రాంగణానికి వెళ్లే రోడ్డును లక్షలాది నిధులు వెచ్చించి ఏర్పాటు చేసిన సీసీ రోడ్డుపై చెత్తను కుప్పలుగా పోస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed