Alleti Maheshwar Reddy : బడ్జెట్ లో అప్పులే ఉన్నాయి : ఏలేటి మహేశ్వర్ రెడ్డి

by M.Rajitha |   ( Updated:2025-03-19 16:47:48.0  )
Alleti Maheshwar Reddy : బడ్జెట్ లో అప్పులే ఉన్నాయి : ఏలేటి మహేశ్వర్ రెడ్డి
X

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ అసెంబ్లీ(Telangana Assembly)లో నేడు డిప్యూటీ సీఎం మల్లు భట్టీ విక్రమార్క(Deputy CM Mallu Bhatti Vikramarka)రాష్ట్ర బడ్జెట్(State Budget) ప్రవేశ పెట్టారు. ఈ బడ్జెట్ పై బీజేపీ శాసనసభాపక్ష నేత, నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి(Alleti Maheshwar Reddy) స్పందించారు. అసెంబ్లీలో బడ్జెట్ ప్రసంగం తర్వాత సభ రేపటికి వాయిదా పడింది. అనంతరం మీడియా పాయింట్ వద్ద ఏలేటి మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. బడ్జెట్ నిండా అప్పులే ఉన్నాయని విమర్శించారు. రూ.36 వేల కోట్లు 2025-2026 రాష్ట్ర ప్రణాళిక వ్యయంగా బడ్జెట్లో చూపించారని.. కేవలం రూ.36 వేల కోట్లతో రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేస్తారో సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy), డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్లో మొత్తం అప్పులు, ఎగవేతలే ఉన్నాయని.. ఇది పసలేని బడ్జెట్ అని ఎద్దేవా చేశారు. ఈ బడ్జెట్ ప్రజలను మోసం చేసే విధంగా ఉందని, ఏ ఒక్క సంక్షేమ పథకానికి, అభివృద్ధి పనులకు సరిగా నిధుల కేటాయింపులు జరగలేదని మండిపడ్డారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం మాదిరాగానే, గొప్పలు తప్ప ప్రజలకు ఉపయోగపడే బడ్జెట్ ఇది కాదని ఆరోపించారు. రేపటి సమావేశాల్లో ప్రభుత్వాన్ని నిలదీస్తామని ఏలేటి మహేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు.

ఈ సారి కూడా నిరుద్యోగులకు మొండి చేయి చూపిస్తారనే సంగతి అర్థమైందని, మహిళలకు ఇస్తామన్న హామీలు ఎందుకు పొందు పర్చలేదో చెప్పాలని ప్రశ్నించారు. రైతులకు ఇచ్చిన హామీలకు రూ. 42 వేల కోట్లు అవసరమని, అది ఎక్కడా బడ్జెట్ లో పెట్టకపోవడం చూస్తే మరోసారి రైతులను మోసం చేయబోతుందనే అంశంగా స్పష్టంగా అర్థమైతుందన్నారు. బీసీ సబ్ ప్లాన్ ప్రకారం బడ్జెట్ ప్రవేశ పెట్టకపోవడం దారుణమని, మైనారిటీలతో పోల్చుకుంటే రూ.16 వేల కోట్లు బీసీలకు ఇవ్వాల్సి వస్తుందని, రూ. 11 వేల కోట్లు మాత్రమే కేటాయించారని, అంటే మైనారిటీలపై ఉన్న ప్రేమ బీసీల మీద ఈప్రభుత్వానికి లేదన్నారు. హామీలన్నీ ఎగవేసి తెలంగాణ ప్రజలను మోసం చేసే బడ్జెట్ మాదిరిగా ఉందని, హామీలు ఇచ్చి మోసం చేసిన రేవంత్ రెడ్డిపై చీటింగ్ కేసు పెట్టాలని డిమాండ్ చేశారు. ప్రతి నియోజక వర్గానికి 3500 ఇళ్లు అని బడ్జెట్ లో పెట్టారని, గత బడ్జెట్ లో కూడా 3500 ఇండ్లు పెట్టి ఒక ఇళ్లు నిర్మించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోసారి ప్రజలను మోసం చేయడానికే ఈ బడ్జెట్ ప్రవేశ పెట్టారని ఆరోపించారు.

Next Story