Ministers : రైతుల సంక్షేమమే లక్ష్యంగా మార్కెట్ కమిటీ పని చేయాలి

by Kalyani |
Ministers : రైతుల సంక్షేమమే లక్ష్యంగా మార్కెట్ కమిటీ పని చేయాలి
X

దిశ,నేలకొండపల్లి: రైతుల సంక్షేమం అజెండాగా ప్రజా ప్రభుత్వం పని చేస్తుందని రాష్ట్ర మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి లు అన్నారు. సోమవారం మంత్రులు నేలకొండపల్లి లో నిర్వహించిన వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గం ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్నారు. మంత్రుల సమక్షంలో నేలకొండపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్షుడుగా నియమించబడిన సీతారాములు, ఉపాధ్యక్షులుగా నియమితులైన సురేష్, ఇతర పాలకవర్గ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ, గతం కంటే మెరుగ్గా రైతులు, పేదల సంక్షేమానికి ప్రజా ప్రభుత్వంలో పాటు పడతామని అన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన మొదటి సంవత్సరంలోనే రూ. 31 వేల కోట్ల రుణమాఫీ చేసిన ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ మాత్రమేనని అన్నారు.

మన రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ రైతులకు ఇచ్చిన హామీ మేరకు రూ.2 లక్షల రుణమాఫీ క్రింద రూ. 18 వేల కోట్లను మాఫీ చేశామని మంత్రి తెలిపారు. రూ.2 లక్షల పైన ఉన్న రుణాలు ఉన్న రైతులకు షెడ్యూల్ ప్రకటించి రుణమాఫీ పూర్తి చేస్తామని అన్నారు. రుణమాఫీ పూర్తయిన రైతులకు కొత్త అప్పులు వస్తాయని అన్నారు. తెల్ల రేషన్ కార్డు లేని రైతుల కుటుంబ సర్వే ద్వారా నిర్ధారణ చేసి రుణమాఫీ పథకం వర్తింప చేస్తామని అన్నారు. దేశంలో అత్యధికంగా వరి పండించే రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందని, సన్నాలు పండించే రైతులకు క్వింటాళ్ల రూ. 500 బోనస్ ప్రకటించామని అన్నారు. రైతుల పంటలకు కూడా పంటల బీమా ప్రీమియం ప్రభుత్వమే చెల్లిస్తుందని మంత్రి తెలిపారు.

రుణమాఫీ పథకం తర్వాత రైతు భరోసా పథకం అమలు అవుతుందని అన్నారు. క్వింటాల్ కు వెయ్యి రూపాయలు నష్టం వచ్చినప్పటికీ తడిసిన పెసర్లను మద్దతు ధర పై కొనుగోలు చేశామని తెలిపారు. మొక్కజొన్నలు, సోయా, పొద్దు తిరుగుడు, కందులు, ఎర్ర జొన్నలు మొదలగు పంటలకు మార్కెట్ లో ధర లేని సమయంలో వేల కోట్ల నష్టం వచ్చినప్పటికీ రైతులను నిలబెట్టాలని మద్దతు ధరకు కొనుగోలు చేస్తున్నామని మంత్రి తెలిపారు. నేలకొండపల్లి మార్కెట్ మంచి పనితీరు కనబరుస్తుందని, దీని అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందజేయడం జరుగుతుందని మంత్రి తెలిపారు. పాలేరు నియోజకవర్గంలో మంజూరు చేసిన మద్దులపల్లి మార్కెట్ పూర్తి చేసేందుకు రూ. 20 కోట్ల మంజూరు చేశామని మంత్రి తెలిపారు.

అమెరికా రోడ్ల మాదిరిగా ఖమ్మం రోడ్లను తీర్చిదిద్దుతున్నామని అన్నారు. ఖమ్మం చుట్టూ రింగ్ రోడ్డు వస్తుందని అన్నారు. ప్రతి నెల రూ. 400 కోట్లు ఖర్చు చేసి మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించామని అన్నారు. భక్త రామదాసు ఎత్తిపోతల పథకం పూర్తి చేసి 70 వేల ఎకరాల సాగునీరు అందించామని అన్నారు. కరువు ప్రాంతంగా ఉన్న పాలేరు నియోజకవర్గాన్ని అత్యంత సాగునీరు వసతి కలిగిన ప్రాంతంగా తీర్చిదిద్దామని అన్నారు. పాలేరు నియోజకవర్గంలో ఉన్న నదుల మీద చెక్ డ్యాంలు, బ్రిడ్జి లు కట్టామని అన్నారు. ఇంటింటికి నల్లా పెట్టి త్రాగునీరు అందించామని అన్నారు. పామాయిల్ సాగు చేసి మరింత లాభం పొందాలని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ… నేలకొండపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గంగా ప్రమాణం చేసిన నాయకులకు శుభాకాంక్షలు తెలుపుతూ, రైతులకు ఏ కష్టం వచ్చినా పార్టీలకతీతంగా అక్కున చేర్చుకొని పనిచేయాలని, వచ్చిన పదవికి మంచి పేరు తెచ్చుకోవాలని మంత్రి సూచించారు.

సెప్టెంబర్ మొదటి వారంలో కురిసిన భారీ వర్షాల కారణంగా ఉమ్మడి ఖమ్మం జిల్లా, వరంగల్ జిల్లా, సూర్యాపేట, నల్గొండ జిల్లాలు నష్టపోయాయని అన్నారు. సీఎం వరద ప్రాంతాల్లో పర్యటించి పునరావాస చర్యలు, వరద సహాయక చర్యలు పర్య వేక్షించారని, కేంద్ర ప్రభుత్వం నుంచి రూపాయి సహాయం రాకపోయినా, నష్టపోయిన ప్రతి ఇంటికి రూ.16,500 ఆర్థిక సహాయం పంపిణీ చేశామని అన్నారు. వరదల వల్ల నష్టపోయిన ప్రతి ఎకరానికి 10 వేల పరిహారం అందజేస్తామని అన్నారు. వరదల వల్ల నీటిపారుదల రంగంలో అనేక చెరువులు, సాగర్ కాలువ 4 చోట్ల దెబ్బ తిన్నప్పటికీ యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరణ పనులు పూర్తి చేశామని అన్నారు. పాలేరు దిగువన ఉన్న రైతాంగానికి కూడా సాగునీరు అందిస్తామని అన్నారు.

చెరువుల ఎఫ్.టి.ఎల్, బఫర్ జోన్లలో పెద్ద పెద్ద బంగ్లాలు కట్టుకున్న బడా బాబుల నిర్మాణాలపై హైకోర్టు అనేకసార్లు అక్షింతలు వేసినప్పటికీ గత ప్రభుత్వం పట్టించుకోలేదని, తమ ప్రభుత్వం చెరువుల పరిరక్షణకు చర్యలు తీసుకుంటుందని, అక్రమ నిర్మాణాలను తొలగిస్తుందని అన్నారు. రాష్ట్రంలో చాలా కాలంగా రేషన్ కార్డుల పంపిణీ జరగలేదని, ప్రజా ప్రభుత్వం అర్హులైన ప్రతి పేదవాడికి రేషన్ కార్డు అందించేందుకు అక్టోబర్ 2 నుంచి దరఖాస్తులు స్వీకరిస్తామని అన్నారు. సన్న వడ్లు పండించే రైతులకు రూ.500 బోనస్ ప్రకటిస్తున్నామని అన్నారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ లు రాయల నాగేశ్వరరావు, మువ్వ విజయ్ బాబు, సాదు రమేష్ రెడ్డి, గోవిందరావు, శాఖమూరి రమేష్, వల్లాల రాధా కృష్ణ, ప్రజా ప్రతినిధులు, అధికారులు, ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed