Solar Village: సోలార్ విలేజ్‌గా కొండారెడ్డిపల్లి.. మోడల్‌గా సీఎం రేవంత్ స్వగ్రామం

by Shiva |
Solar Village: సోలార్ విలేజ్‌గా కొండారెడ్డిపల్లి.. మోడల్‌గా సీఎం రేవంత్ స్వగ్రామం
X

దిశ, తెలంగాణ బ్యూరో/అచ్చంపేట: రాష్ట్రంలోనే ఫస్ట్ టైమ్ ఓ గ్రామం మొత్తం సోలార్ విలేజ్‌గా మారనుంది. సీఎం రేవంత్‌రెడ్డి స్వగ్రామమైన మహబూబ్‌నగర్ జిల్లా కొడంగల్ మండలం కొండారెడ్డిపల్లిని 100 శాతం సౌర విద్యుత్ విలేజ్‌గా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు షురూ చేసింది. ఈ విలేజ్‌ను పూర్తిగా సోలార్ ప్రాంతంగా తయారు చేసి రాష్ట్రంలోనే మోడల్‌గా మార్చాలని సర్కారు భావిస్తున్నది. సీఎం ఆదేశాల మేరకు ఈ లక్ష్యాన్ని సాధించేందుకు వివిధ శాఖల అధికారులు క్షేత్రస్థాయిలో అధ్యయనం చేస్తున్నారు.

కొండారెడ్డిపల్లిలో అధికారుల పర్యటన

దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ చైర్మన్-మేనేజింగ్ డైరెక్టర్ ముషారఫ్ ఫరూఖీ, నాగర్‌కర్నూల్ జిల్లా కలెక్టర్ సంతోష్, రెడ్కో (రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్‌మెంట్ కార్పొరేషన్) వైస్ చైర్‌పర్సన్ (ఎండీ కూడా) అనిల, ఆ సంస్థ డైరెక్టర్ (కమర్షియల్) రాములు, ఇతర శాఖల ముఖ్య అధికారులు కొండారెడ్డిపల్లి గ్రామంలో పర్యటించారు. గ్రామస్తులు, రైతులు, స్థానిక ప్రజాప్రతినిధులతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం సోలార్ విలేజ్‌గా ఈ గ్రామాన్ని పైలట్ ప్రాజెక్టుగా తీసుకున్న అంశాన్ని వివరించి వారికి అవగాహన కల్పించారు.

విద్యుత్ వాడకంపై ఆరా

కొండారెడ్డిపల్లిలో 499 మంది గృహ వినియోగదారులు, 66 మంది వాణిజ్య వినియోగదారులు, 867 మంది వ్యవసాయ వినియోగదారులు ఉన్నట్టు అధికారులు గుర్తించారు. అన్ని రకాల విద్యుత్ వినియోగదారుల సంఖ్య 1,451 ఉన్నట్టు నిర్ధారించారు. ఇప్పటివరకూ డిస్కం అందిస్తున్న విద్యుత్‌ను వినియోగిస్తున్నా ఇకపైన సౌర విద్యుత్‌ మాత్రమే వాడేలా ప్రణాళిక తయారు చేస్తున్నారు. ఇంటింటి సర్వే మొదలు పెట్టిన ఆఫీసర్లు గ్రామంలోని వినియోగదారుల సగటు విద్యుత్ వాడకాన్ని పరిశీలించారు. దక్షిణ డిస్కంలోని రికార్డుల ప్రకారం ఏయే అవసరాలకు ఎంత విద్యుత్ వాడుతున్నారో గణాంకాలను తెలుసుకున్నారు.

పకడ్బందీగా యాక్షన్ ప్లాన్‌

సౌర విద్యుత్‌ మాత్రమే వాడేలా ప్రజల్లో అవగాహన కలిగించి దానికి తగిన మౌలిక సౌకర్యాలు కల్పించి వారందరికీ ప్రభుత్వం తరఫున సబ్సిడీ ధరలకు ఉపకరణలు అందించి ఎప్పటిలోగా పూర్తి స్థాయిలో సోలార్ విలేజ్‌గా మార్చవచ్చో అన్న దానిపై అధికారులు స్టడీ చేస్తున్నారు. గ్రామానికి అవసరమయ్యే మొత్తం విద్యుత్, దాన్ని సోలార్ ప్లేట్ల ద్వారా ఉత్పత్తి చేసుకోవడం, రాత్రి అవసరాలకు సైతం వాడుకునేలా బ్యాటరీల వాడడం.. ఇలాంటి అంశాలను పరిశీలించిన తర్వాత విద్యుత్ శాఖ అధికారులు సమగ్ర ప్రాజెక్టు నివేదికను రూపొందించి ప్రభుత్వానికి సమర్పించనున్నారు. దానికి తగినట్లుగా యాక్షన్ ప్లాన్‌ రెడీ చేసి పటిష్టంగా అమలు చేయడంపై ఆఫీసర్లు దృష్టి సారించనున్నారు.

Advertisement

Next Story