వర్షాకాలం లోపు రోడ్డు అభివృద్ధి పనులు పూర్తి చేయాలి : మంత్రి పొంగులేటి

by Kalyani |
వర్షాకాలం లోపు రోడ్డు అభివృద్ధి పనులు పూర్తి చేయాలి : మంత్రి పొంగులేటి
X

దిశ,ఖమ్మం రూరల్ : వర్షాకాలంలోపు ఏదులాపురం మునిసిపాలిటీలో చేపట్టిన రోడ్డు అభివృద్ధి పనులు పూర్తి చేయాలని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖామంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఆదివారం మంత్రి ఏదులాపురం మునిసిపల్ ప్రాంతంలో పర్యటించి పలు రోడ్డు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. రూ.2 కోట్ల 85 లక్షలతో గుర్రాలపాడు నుంచి కొత్త నారాయణపురం వరకు బీ.టీ. రోడ్డు నిర్మాణం, రూ. 2 కోట్ల 4 లక్షలతో వెంకటగిరి ఎస్సీ, బీసీ కాలనీ నుంచి ఖమ్మం గుదిమళ్ళ జడ్పీ రోడ్డు వరకు బిటి రోడ్డు, కోటి 95 లక్షలతో గుదిమల్ల నుండి తొర్రివాగు డొంక రైస్ మిల్లు వరకు చేపట్టిన బి.టి. రోడ్డు నిర్మాణ పనులకు మంత్రి శంకుస్థాపనలు చేశారు.

ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. ఏదులాపురం ప్రాంతంలో చేపట్టిన రోడ్డు నిర్మాణ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని వచ్చే వర్షాకాలం లోపు పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొని రావాలని అన్నారు. ప్రజల అవసరాల మేరకు చేయవలసిన రోడ్డు నిర్మాణ పనులకు ప్రతిపాదనలు అందించాలని మంత్రి అధికారులకు సూచించారు. అనంతరం మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గుదిమల్లలోని తిరుపతమ్మ తల్లి దేవాలయంలో అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, ఆర్ అండ్ బి ఎస్ఇ హేమలత, ఆర్డీఓ నరసింహారావు, పంచాయతీ రాజ్ ఈఈ వెంకట్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ ఏ. శ్రీనివాస్ రెడ్డి, ఖమ్మం రూరల్ మండల తహసీల్దార్ రాంప్రసాద్, వివిధ అధికారులు, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Next Story