పన్నుల వసూళ్ల పై ఫోకస్.. రంగంలోకి స్పెషల్ టీంలు..

by Sumithra |
పన్నుల వసూళ్ల పై ఫోకస్.. రంగంలోకి స్పెషల్ టీంలు..
X

దిశ, ఆమనగల్లు : మున్సిపాలిటీలకు పన్నుల ప్రధాన వనరులు. ఆస్తి పన్ను, భవన నిర్మాణ, లే అవుట్ అనుమతులు, నల్ల చార్జీలు, ట్రేడ్ లైసెన్స్, మున్సిపల్ ఆస్తుల అద్దెలు తదితర రూపాల్లో మున్సిపాలిటీకి ఆదాయం వస్తుంది. వీటిలో ఆస్తిపన్నుదే ప్రధాన వాటా. ఆమనగల్లు మున్సిపాలిటీలో నిర్దేశించిన స్థాయిలో పన్నులు వసూలు కాకపోవడంతో నిధుల కొరత వెంటాడుతుంది. వసూలవుతున్న కొద్దిపాటి నిధులతో ఉద్యోగుల జీతభత్యాలు, విద్యుత్ చార్జీల చెల్లింపులకే సరిపోతుంది. పలు కాలనీల్లో మౌలిక వసతుల కల్పన, అభివృద్ధి పనులకు నిధులు సరిపోవడం లేదు. దీంతో పన్నుల వసూలు కోసం ఆమనగల్లు మున్సిపాలిటీ అధికారులు పన్ను వసూలు కోసం స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. మొండి బకాయి దారులకు తాగునీరు, పారిశుద్ధ్యం వంటి సర్వీసులను నిలిపివేయాలని భావిస్తున్నారు.

నిధులు లేక అభివృద్ధి పనులకు ఆటంకం..

మున్సిపాలిటీ నుండి వసూల్ అవుతున్న కొద్దిపాటి నిధులతో ఉద్యోగుల జీతభత్యాలు విద్యుత్ చార్జీల చెల్లింపునకే సరిపోతుందని అధికారులు పేర్కొంటున్నారు. ఉద్యోగుల జీతభత్యాలకు, తాగునీరు పారిశుధ్య పనులకు ఉపయోగించే వాహనాల డీజిల్ ఖర్చులకు ప్రతి నెల రూ. 10 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది. దీంతో పన్నుల ద్వారా వస్తున్న నిధుల పై వాటికి సరిపోతుండడంతో అభివృద్ధి పనులకు నిధుల కొరత వెంటాడుతున్నది. ఆమనగల్లు మున్సిపాలిటీలో మిగులు బడ్జెట్ లేకపోవడం గమనార్హం.

53 శాతమే వసూలు ఈ ఏడాది ఇప్పటివరకు మున్సిపాలిటీలో 53 శాతం పన్నులు వసూలు అయ్యాయి. మున్సిపాలిటీలో రూ. 2.21 కోట్ల పన్నులు వసూలు చేయాల్సి ఉండగా, ఇప్పటి వరకు రూ 1.15 కోట్లు మాత్రమే వసూలు అయ్యాయి. ఇంకా రూ 1.05కోట్లు వసూలు చేయాల్సి ఉంది. మొండి బకాయిలు కట్టని వారికి తాగునీరు, చెత్త సేకరణ వాహనాలను బందు చేసే ఆలోచనలో మున్సిపాలిటీ అధికారులు ఉన్నారు.

మొండి బకాయిలను వసూలు చేయనున్నాం.. శంకర్ మున్సిపాలిటీ కమిషనర్

పన్నులు వసూలు కాకపోవడంతో మున్సిపాలిటీలో మిగులు బడ్జెట్ లేదు. దీంతో అభివృద్ధికి ఆటంకంగా మారింది. టాక్స్ వసూలు కోసం మున్సిపాలిటీలో స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నాం. మొండి బకాయిలను వసూలు చేయనున్నాం. ప్రజలు సకాలంలో పనులు చెల్లించి మున్సిపాలిటీ అభివృద్ధికి సహకరించాలి.

Next Story