Belt shops : బెల్ట్ జోరు.. ప్రజలు బేజారు..

by Sumithra |
Belt shops : బెల్ట్ జోరు.. ప్రజలు బేజారు..
X

దిశ, మోమిన్ పేట్ : మోమిన్ పేట్ మండలంలో మద్యం ఏరులై పారుతున్నది. మద్యం షాప్ యజమానులే ‘బెల్ట్ దందా’కు తెరలేపారు. అధిక లాభాలు గడించేందుకు బెల్టుషాపుల ( Belt shops ) నిర్వాహకులతో ఒప్పందం చేసుకొని అడ్డదారులు తొక్కుతున్నారు. మోమిన్‌పేట్ మండలంలోని ఆయా గ్రామాల్లో మద్యం షాపులున్నాయి. మండలంలో 20 నుంచి 30కి పైగా గ్రామపంచాయతీలు ఉన్నాయి. ప్రతి గ్రామంలోనూ బెల్ట్ దుకాణాలు జోరు తారాస్థాయికి చేరింది. మారుమూల పల్లెల్లోనూ 2, 3కి పైగా బెల్ట్ దుకాణాలు ఏర్పడ్డాయంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. ఒక్కో మండలంలో దాదాపు 300కి పైగా బెల్ట్ దుకాణాలు పుట్టగొడుగుల్లా వెలిశాయి.

మద్యం షాప్ యజమానులు కుమ్మక్కై వైన్స్ మండలాల్లోని ఒక్కొక్కరు గ్రామాల చొప్పున పంచుకొని బెల్ట్ షాపుల నిర్వాహకులు తమ షాపులోనే మద్యం కొనుగోలు చేయాలని నిబంధన పెట్టారు. కొనుగోలు చేసే మద్యం బాటిళ్ల పై షాపు పేరుతో స్టిక్కర్లను అంటిస్తున్నారు. బెల్ట్ షాపులకు అధిక ధరలకు మద్యం అమ్మకాలు చేస్తూ కొన్ని కోట్ల రూపాయలు దోచుకుంటున్నారు. ప్రభుత్వం బెల్టుషాపులు ఎత్తేస్తామని చెప్పినా ఎక్సైజ్ అధికారులు ( Excise officials ) మామూళ్లు తీసుకుంటూ చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఏరులై పారుతున్న మద్యం..

వికారాబాద్ జిల్లాలోని ఆయా మండలాల్లో బెల్టు షాప్ నిర్వాహకులు, మద్యం షాప్ యజమానులు ఒక్కటై రూ.కోట్లు కొల్లకొడుతున్నారు. సిండికేట్‌గా ఏర్పడి వినియోగదారుల జేబులు ఖాళీ చేస్తూ దొరికిన వారికి దొరికినంతగా దోచుకుంటున్నారు. మద్యం వ్యాపారులు బెల్ట్ షాపుల నిర్వాహకులతో తమకు పర్సంటేజ్ అధికంగా ఇచ్చే కంపెనీల మద్యం మాత్రమే విక్రయించాలని అంతర్గత ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలుస్తున్నది. మద్యం షాపులో ప్రధాన బ్రాండ్ల విక్రయాలను నిలిపివేసి, కొన్నింటిని మాత్రమే ఉంచుతున్నారు. ప్రధాన బ్రాండ్లను బెల్ట్ షాపునకు అధిక ధరలకు విక్రయిస్తూ రోజుకు రూ.లక్షల్లో లాభాలు గడిస్తున్నారు. కస్టమర్‌కు నేరుగా అమ్మితే ఎమ్మార్పీ వస్తుందని, అదే బెల్టుషాపునకు అయితే ఎమ్మార్పీకి మించి అమ్మొచ్చనే ఉద్దేశ్యంతోనే మద్యం నిర్వాహకులు ఈ పనికి పాల్పడుతున్నారని మద్యం ప్రియులు ఆరోపిస్తున్నారు. పేరున్న బ్రాండ్ క్వార్టర్ సీసాలను బెల్టు షాపులకు పంపిస్తూ రూ.20 అదనంగా బెల్టుషాపు నిర్వాహకుల వద్ద పుచ్చుకుంటున్నారు. బెల్ట్ నిర్వాహకులు దీనికి అదనంగా మరో రూ.20 లాభం చూసుకొని కస్టమర్లకు ఇస్తున్నారు.

అధికారుల కనుసన్నల్లోనే..

మండలంలో ఎక్సైజ్ అధికారుల కనుసన్నల్లోనే మద్యం దందా జరుగుతుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా ఎన్నో బెల్ట్ షాపులు వెలిసినా ఎక్సైజ్ అధికారులు ఏం చేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. నెలనెలా మామూళ్లు తీసుకుంటున్నారని, అన్నీ తెలిసి చర్యలు తీసుకోవడం లేదని తెలుస్తున్నది. మరోవైపు మద్యం యజమానులు, బెల్ట్ షాపు నిర్వాహుకులు, అధికారుల మధ్య ఒప్పందాలతోనే ఈ దందా కొనసాగుతున్నట్లు తెలుస్తున్నది. ఇప్పటికైనా ఎక్సైజ్ అధికారులు స్పందించి మద్యం దందాను అడ్డుకోవాలని కోరుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed