కుక్కల దాడిలో తాజాగా మరో జింక హతం

by Kalyani |
కుక్కల దాడిలో తాజాగా మరో జింక హతం
X

దిశ, పరిగి : అటవీ ప్రాంతంలో ఉన్న వన్యప్రాణులకు రక్షణ కరువైందని దోమ మండల ప్రజలు తప్పుపడుతున్నారు. దోమ మండలం పోతిరెడ్డిపల్లి గ్రామ శివారులోని చెరువు వద్ద ఆదివారం ఉదయం ఊర కుక్కలు జింకను వెంబడించాయి. చెరువులో నీరు తాగేందుకు వచ్చిన జింకను గమనించిన కుక్కలు వెంబడించి తీవ్రంగా గాయపరిచాయి. ఇది గమనించిన స్థానికులు వెంటనే కుక్కలను బెదిరించి జింకను చేరదీశారు. అప్పటికి తీవ్రగాయాలైన జింకను గ్రామస్తులు గ్రామానికి తీసుకువచ్చి వెంటనే ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు. ఫారెస్ట్ అధికారులు పరిగి ప్రభుత్వ పశు వైద్యశాలకు తీసుకు వస్తుండగా జింక మార్గ మధ్యంలోనే మృతి చెందింది. మృతి చెందిన జింకను తిమ్మాయపల్లి ఫారెస్ట్ లో జెసిబి తో గుంత తవ్వి అందులో పూడ్చి పెట్టారు. పోతిరెడ్డిపల్లి గ్రామంలో కొద్ది రోజుల క్రితం మరో జింక కూడా మృతి చెందగా గుట్టుచప్పుడు కాకుండా పూడ్చిపెట్టారు. ఇలా నెలకు ఓ జింక మృతి చెందుతూ పోతే అడవిలో వన్యప్రాణులు కనుమరుగవుతాయని ఆందోళన చెందుతున్నారు. ఫారెస్ట్ అధికారులు స్పందించి వన్యప్రాణుల రక్షణకు చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.

Next Story