వారిని అయ్యో పాపం అంటే ఆగమవుతాం: Thaneeru Harish Rao

by Mahesh |
వారిని అయ్యో పాపం అంటే ఆగమవుతాం: Thaneeru Harish Rao
X

దిశ, తెలంగాణ బ్యూరో: కాంగ్రెస్ పార్టీని అయ్యో పాపం అంటే ఆగమవుతామని మంత్రి హరీష్ రావు అన్నారు. ఒక్కసారి అవకాశం ఇవ్వండి అని కాంగ్రెస్ నేతలు అడుగుతున్నారని ఎందుకు ఇవ్వాలని ప్రశ్నించారు. పక్క రాష్ట్రం రజినీ కాంత్ వచ్చి తెలంగాణ అభివృద్ధి బాగుంది అన్నారు.. కానీ ఇక్కడ ఉన్న గజినీలకు అర్థం కావడం లేదని దుయ్యబట్టారు. కాంగ్రెస్ గజనీల పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు పిలుపునిచ్చారు. తెలంగాణ భవన్ లో టీపీసీసీ మాజీ జనరల్ సెక్రటరీ నగేష్ ముదిరాజ్ సోమవారం బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఆయనకు మంత్రి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ బీసీలను విస్మరించింది కాంగ్రెస్ పార్టీ విస్మరించిందన్నారు.

తెలంగాణ ద్రోహులతో కాంగ్రెస్ పార్టీ కలిసిందని మండిపడ్డారు. 2018 లో కూడా మహాకూటమితో తెలంగాణ ద్రోహులతో కాంగ్రెస్ చేతులు కలిపిందని, అప్పుడు తెలంగాణ ఉద్యమ నేత కేసీఆర్ కు పట్టం కట్టారన్నారు. ఇప్పుడు అదే రీతిలో కలిశారని, బీఆర్ఎస్ హ్యాట్రిక్ విజయం ఖాయమన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకుంటే గడ్డం తీసుకోనన్న ఉత్తమ్, కొడంగల్ లో గెలవకపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటామన్న రేవంత్ లు ఇద్దరు మాట తప్పారని.. ఏం చేశారని, ఏం చూసి వారికి ఓటు వేయాలని ప్రశ్నించారు. రేవంత్ తెలంగాణ ద్రోహి అని ధ్వజమెత్తారు. తెలంగాణ వ్యతిరేక శక్తులు బీజేపీ, కాంగ్రెస్ రూపంలో కుట్రలు పన్నుతున్నారని మండిపడ్డారు.

24 గంటల కరెంటు ఇచ్చే రాష్ట్రంలో 5 గంటల కరెంటు ఇస్తామని డీకే శివకుమార్ చెప్తున్నాడని, ఆయన ప్రకటనతో కాంగ్రెస్ హిట్ వికెట్ పోతోందన్నారు. కాంగ్రెస్ నాయకులు గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్ పాలనలో రైతు బంధు పడుతుండగా, రైతు బీమా వస్తుండగా, కళ్యాణ లక్ష్మి ఇస్తుండగా, 24 కరెంట్ ఉండగా, పింఛన్లు ఇస్తుండగా అన్ని బాగున్నపుడు ఎందుకు రిస్క్ తీసుకోవాలన్నారు. ఒక్కొక్క సమస్యను కేసీఆర్ తీర్చుతున్నారన్నారు. సోషల్ మీడియాలో కొందరు ఫేక్ గాళ్ల న్యూస్ తో మోసపోవద్దన్నారు. కళ్ళతో చూసింది నమ్మండి.. చెవులతో విన్నది నమ్మకండి అని ప్రజలకు సూచించారు. కాంగ్రెస్ పాలనలో ప్లైఓవర్లు నిర్మించాలని సోయిలేదని మండిపడ్డారు.

ముదిరాజులను కేసీఆర్ అన్ని విధాలుగా ఆదుకుంటారని, గతంలో ఎన్నడూ లేని విధంగా ముదిరాజ్ సంక్షేమానికి ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు. సొసైటీ లో కొత్తగా సభ్యులను చేర్చామని, గ్రామాల్లో చెరువులపై ముదిరాజ్ లకే హక్కులు కల్పించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యే ముఠా గోపాల్, మాజీ ఎంపీ సీతారాం నాయక్, మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story