స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషన్‌కు నోటిఫికేషన్ జారీ

by Satheesh |
స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషన్‌కు నోటిఫికేషన్ జారీ
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర సమాచార కమిషన్ ఏర్పాటు కోసం కసరత్తు మొదలైంది. చీఫ్ కమిషనర్‌తో పాటు కమిషనర్ల నియామకం కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ అయింది. అప్లై చేసుకునేందుకు ఈ నెల 29 డెడ్‌లైన్. సమాచార హక్కు చట్టంలోని సెక్షన్ 15, 16లో పేర్కొన్న నిబంధనల మేరకు అర్హత కలిగినవారు దరఖాస్తు చేసుకోవచ్చని చీఫ్ సెక్రటరీ ఆ నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. దరఖాస్తు నమూనాను వెబ్‌సైట్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చునని, అర్హతలను ధృవీకరించే పత్రాలను జత చేసి రిజిస్ట్రర్డ్ పోస్టు ద్వారా సెక్రటేరియట్‌లో సీఎస్ కార్యాలయానికి పంపవచ్చునని తెలిపారు. గత ప్రభుత్వంలో నోటిఫికేషన్ జారీ అయినప్పుడు దరఖాస్తు చేసుకున్నవారు మరోసారి ఇప్పుడు అప్లై చేయాల్సిన అవసరం లేదని, అవి చెల్లుబాటు అవుతాయని స్పష్టం చేశారు.

ఈ నెల 29వ తేదీ సాయంత్రం 5.00 గంటల వరకు రిజిస్టర్డ్ పోస్టు ద్వారా సీఎస్ ఆఫీసుకు చేరిన దరఖాస్తులను, గతంలో ఆల్రెడీ అప్లై చేసుకున్నవారి అప్లికేషన్లను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటామని, గడువు దాటిన తర్వాత వచ్చేవాటిని పరిశీలించబోమని తెలిపారు. సమాచార హక్కు చట్టం నిబంధనల ప్రకారం రాష్ట్ర కమిషన్‌లో ఒక చీఫ్ కమిషనర్‌తో పాటు మరో పది మంది కమిషనర్లను నియమించే అవకాశమున్నది. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచీ ఈ సంఖ్య మేరకు భర్తీ కాలేదు. చీఫ్ కమిషనర్‌తో పాటు మరో ఆరుగురు కమిషనర్లు మాత్రమే పనిచేశారు. గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్‌లో సైతం ఒక చీఫ్ కమిషనర్‌ పోస్టుతో పాటు మరో ఆరుగురు కమిషనర్లను భర్తీ చేసేలాగనే అప్పటి సీఎస్ పేర్కొన్నారు.

Advertisement

Next Story